తెలంగాణ

telangana

ఆర్​సీఈపీ ఒప్పందం ఇప్పుడు లేనట్లే..!

By

Published : Nov 4, 2019, 7:26 AM IST

ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచిపోయే 'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య' (ఆర్​సీఈపీ) ఒప్పందంలో జాప్యం అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. వెల్లువెత్తుతున్న చైనా దిగుమతులపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన భారత్‌... కొన్ని కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకువచ్చింది.

MODI

బ్యాంకాక్‌లో ఆసియాన్‌ దేశాల శిఖరాగ్ర సమావేశంలో 'ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య' ఒప్పందం ఖరారయ్యే ఆవకాశాలు తగ్గిపోయాయి. ఇది ఇక 2020కి వాయిదా పడినట్లేనని ఆగ్నేయాసియా దేశాధినేతల ముసాయిదా ఒప్పంద ప్రకటన చెబుతోంది.

భారత్​ ఒక్కటే..!

భారత్‌ నుంచి న్యూజిలాండ్‌ వరకు 16 దేశాల మధ్య ఆర్​సీఈపీ ఒప్పందం కుదరాల్సి ఉంది. ప్రపంచంలో సగం జనాభా ఈ దేశాల్లోనే ఉంది. మార్కెట్‌ అందుబాటు సంబంధిత చర్చలు చాలావరకు పూర్తయ్యాయని, కొద్దిపాటి ద్వైపాక్షిక అంశాలు 2020 ఫిబ్రవరి నాటికి కొలిక్కి వస్తాయని ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్నారు.

సభ్యదేశాల్లో ఒక్కటి మినహా మిగిలిన అన్నింటి తీర్మానాలు పూర్తయ్యాయని చెప్పడం భారత్‌ను ఉద్దేశించేనని భావిస్తున్నారు. ఆర్​సీఈపీపై సంతకం చేయడానికి దేశాలన్నీ కట్టుబడి ఉన్నాయని ప్రకటన పేర్కొంది.

చైనాపై అభ్యంతరం

భారత ప్రధాని నరేంద్రమోదీ బ్యాంకాక్‌లో ఆసియాన్‌ దేశాధినేతలతో ఆదివారం సమావేశమయ్యారు. చైనా చౌక వస్తువులు వెల్లువలా వచ్చి పడటం వల్ల తమ దేశంలో చిరు వ్యాపారుల పరిస్థితి దెబ్బతింటుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్‌ అందుబాటు అనేది అన్ని పక్షాలకూ అర్థవంతమైన రీతిలో ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు.

ఆర్​సీఈపీ ఒప్పందం గురించి ఈ భేటీల్లో మాటమాత్రంగానైనా ఆయన ప్రస్తావించలేదు. ఆసియాన్‌తో భారత్‌ ఒప్పందం పునఃసమీక్ష కోసమే మాట్లాడారు.

ఆకర్షణీయ గమ్యస్థానాల్లో భారత్‌

యథాలాపంగా, అధికార యంత్రాంగం చెప్పినట్లుగా నడుచుకునే పద్ధతికి భారత్‌ స్వస్తిపలికి, సమూల మార్పులు చేపట్టిందని మోదీ చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానాల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందని తెలిపారు. ముఖ్యంగా పన్ను వ్యవస్థల పరంగా తీసుకువచ్చిన సంస్కరణల గురించి వివరిస్తూ వీటిని మున్ముందు మరింతగా సరళతరం చేస్తామన్నారు.

థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా గ్రూపు కార్యకలాపాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. పన్నుల్లో విచక్షణకు, వేధింపులకు ఇప్పుడు తావులేదని చెప్పారు. భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమన్నారు.

దేశాధినేతలతో భేటీ

ఆసియాన్‌ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతో మోదీ భేటీ అయ్యారు. భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.

థాయిలాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చాన్‌-ఒ-చాతో మోదీ సమావేశమై రెండు దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల వాణిజ్య సహకారంపై చర్చించారు. విశాఖ, కోల్‌కతా, చెన్నై ఓడరేవులకు సరకు రవాణాపైనా ప్రస్తావనకు వచ్చింది.

మయన్మార్‌ స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌శాన్‌ సూకీతో మోదీ భేటీ అయ్యారు.

ఇదీ చూడండి: ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

ABOUT THE AUTHOR

...view details