మీడియాపై ఎన్నోసార్లు బహిరంగంగానే ఆగ్రహాన్ని ప్రదర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అదే విధంగా ప్రవర్తించారు. అయితే.. ఈ సారి ట్రంప్ కోపానికి గురైంది పాకిస్థానీ విలేకరులు. కశ్మీర్ అంశంపై స్పందించాలని ట్రంప్పై పదే పదే ఒత్తిడి చేసిన నేపథ్యంలో... 'ఇలాంటి రిపోర్టర్లను ఎక్కడినుంచి పట్టుకొస్తారు' అని పాక్ ప్రధాని ఇమ్రాన్తో చమత్కరించారు డొనాల్డ్.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా... ట్రంప్, ఇమ్రాన్లు సోమవారం సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, కశ్మీర్ సమస్య, అఫ్గాన్లో శాంతి అంశాలపై చర్చించారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో... జమ్ము ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో లోయలో నెలకొన్న పరిస్థితులపై పాక్ విలేకరులు ట్రంప్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
కశ్మీర్ పరిస్థితులపై అడిగిన ఓ పాకిస్థానీ విలేకరిని ట్రంప్ ఎగతాళి చేశారు. నువ్వేమైనా.. ఖాన్ బృందంలో సభ్యునివా..? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.