తెలంగాణ

telangana

By

Published : Jun 29, 2020, 6:49 PM IST

ETV Bharat / international

పాక్ స్టాక్ మార్కెట్​పై దాడి- బలూచ్ ముష్కరుల పనే

పాకిస్థాన్​లో ఉగ్రవాదులు మరోసారి చెలరేగిపోయారు. ఏకంగా.. కరాచీలోని పాకిస్థాన్​ స్టాక్ ఎక్స్చేంజ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది, ఒక ఎస్సై, ఇద్దరు స్థానిక పౌరులు మరణించారు. నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ దాడి తమ పనేనని ప్రకటించింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.

pse
పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్​పై దాడి.. బలూచ్ ముష్కరుల పనే

పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్​పై దాడి..

కరాచీలోని పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్​పై నలుగురు సాయుధులు తుపాకులు, గ్రనేడ్లతో దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ అధికారి, ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ఉగ్రవాదులు కాసేపటికే హతమయ్యారు.

ఇలా జరిగింది..

ఓ కారులో వేగంగా దూసుకొచ్చిన దుండగులు కార్యాలయ ప్రధాన ద్వారంపైకి గ్రనేడ్లు విసిరారు. అనంతరం ఎక్స్ఛేంజ్​లోకి చొచ్చుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ముష్కరులతో పోరాడుతూనే ఉద్యోగులను ఖాళీ చేయించారు.

ఉగ్రవాదులు స్టాక్​ మార్కెట్ సిబ్బందిన బందీలుగా చేసుకుందామని కుట్ర పన్నారని, వారి పన్నాగాన్ని భగ్నం చేశామని చెప్పారు పోలీసులు.

"స్టాక్ ఎక్స్ఛేంజ్​లోకి చొరబడేందుకు వీలుగా ప్రవేశ ద్వారంపై ముష్కరులు గ్రనేడ్లు విసిరి.. కాల్పులు జరిపారు. అయితే వారిలో ఒకడు హతమవ్వడం వారిని వెనక్కి తగ్గేలా చేసింది. ముష్కరుల వద్ద నుంచి గ్రనేడ్లు, బాంబులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. వారి సన్నద్ధత చూస్తుంటే ఎక్కువ కాలం పాటు భవనంలో గడపాలన్న వ్యూహంతో వచ్చారని తెలుస్తోంది."

-కరాచీ పోలీసుల ప్రకటన

స్టాక్ ఎక్స్ఛేంజ్ వద్ద భద్రత

'ట్రేడింగ్ నిలిచిపోలేదు..'

స్టాక్​ ఎక్స్ఛేంజ్​పై జరిగిన ఉగ్రదాడి వల్ల ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోలేదని ప్రకటించారు కరాచీ పోలీసులు. హతులైన ఉగ్రవాదుల శరీరాలను పరిశీలన కోసం కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాన కార్యాలయం వద్దకు కూడా ముష్కరులు వెళ్లలేకపోయారని.. స్టాక్​ మార్కెట్ ప్రాంగణంలోనే వారిని మట్టుబెట్టినట్టు ప్రకటించారు.

'ఆర్థిక వ్యవస్థను కూల్చేందుకే..'

స్టాక్ ఎక్స్ఛేంజ్​పై జరిగిన దాడిని జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థను కూల్చేందుకు జరిగిన యత్నమని అభివర్ణించారు సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్ అలీ. వైరస్ పరిస్థితులను జాతి వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు.

'మాదే బాధ్యత'

కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్​పై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్​ఏ). తమ ముఠాలోని మాజీద్ బ్రిగేడ్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిపినట్లు తెలిపింది. గతేడాది ఇదే తరహా దాడికి పాల్పడింది బీఎల్​ఏ. చైనా సహకారంతో పాక్ కరాచీ తీరంలో నిర్మిస్తున్న గ్వదార్​ పోర్ట్​కు సమీపంలోని హోటల్​పై దాడి చేసింది. బలూచ్ ప్రాంతంలోని వనరులను స్థానికులకు పాక్ ప్రభుత్వం దూరం చేస్తోందని.. తమ ప్రాంత వనరులపై ఆధిపత్యం తమదేనన్న లక్ష్యంతో గత 70 ఏళ్లుగా పోరాడుతోంది బీఎల్​ఏ.

ఇదీ చూడండి:ఆగస్టు 18న గిల్గిట్‌- బాల్టిస్థాన్‌లో ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details