తెలంగాణ

telangana

ETV Bharat / international

'పాక్​ను ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​లిస్ట్​లో పెట్టాల్సిందే'

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్​ను ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్​.. గ్రే​ జాబితాలోంచి బ్లాక్​లిస్ట్​లోకి చేర్చాలంటున్నారు విశ్లేషకులు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎఫ్ఏటీఎఫ్ సూచించిన ఎటువంటి చర్యలు పాక్​ తీసుకోకపోగా.. ముష్కరులకు నిధులు సమకూరుస్తూ వారిని మహారాజుల్లా పోషిస్తోందని మండిపడుతున్నారు. అక్టోబర్​లో ఎఫ్ఏటీఎఫ్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో పాక్​ భవితవ్యం ఏంటన్నది చర్చనీయాంశమైంది.

By

Published : Sep 23, 2020, 7:37 PM IST

FATF
ఎఫ్ఏటీఎఫ్

ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్ సమావేశం అక్టోబర్​లో జరగనుంది. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు దాయాది దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముష్కర మూకలకు ఆశ్రయం కల్పిస్తూ.. వారికి నిధులు సమకూరుస్తున్న 'ఇస్లామాబాద్'​ ఉగ్రవాద కార్యకలపాలకు బాధ్యత వహించాల్సిందేనంటున్నారు.

ఈటీవీ భారత్​ ముఖాముఖిలో.. పాక్​ ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్​లిస్ట్​లోకి వెళ్లక తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేశారు విదేశీ వ్యవహారాల నిపుణులు సువ్రో కమల్​ దత్తా.

"పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, భారత్​పై దాడులు చేసేందుకు ముష్కర మూకలకు సహకరిస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగిస్తుంది. గత 30-35 ఏళ్లుగా ఉగ్రవాదుల్ని అడ్డుపెట్టుకుని భారత్​పై యుద్ధం చేస్తోంది. ఉగ్రవాదానికి ఎగుమతిదారుగా మారిన పాక్ భవిష్యత్తులోనూ ఇదే పంథా కొనసాగిస్తుంది."

-సువ్రో కమల్​ దత్తా, విదేశీ వ్యవహారాల నిపుణులు

కేరళ, బంగాల్​లలో ముష్కరులు ఎన్​ఐఏ చేతికి చిక్కటం కొత్తేం కాదని.. గతంలో పట్టుబడిన ఉగ్రవాదులందరూ పాకిస్థాన్​లోని ఇంటర్​-సర్వీస్​ ఇంటెలిజెన్స్​(ఐఎస్​ఐ)తో సంబంధాలు కలిగి ఉన్నవారేనని గుర్తుచేశారు కమల్​ దత్తా. భారత్​లో అశాంతి రాజేయటమే వారి లక్ష్యమని.. భవిష్యత్తులోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయంటున్నారు. పాకిస్థాన్ అజెండా సైతం ఇదేనని చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్ తన మనుగడ కోసం భారత్​లో సమస్యలు సృష్టిస్తోందని.. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ అంశాన్ని అందుకే పదేపదే లేవనెత్తుతోందంటున్నారు దత్తా.

"పాకిస్థాన్​ ప్రపంచానికి తాము ఉగ్ర స్థావరాలను తుడిచిపెడుతున్నాము, తమ గడ్డకు ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పించేందుకు పాటుపడుతన్నామని చెప్పందుకు ప్రయత్నిస్తోంది. కానీ అలాంటిదేం జరగట్లేదు. పైగా ఉగ్రవాదులను పట్టుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామని.. ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలుకుతోంది. ప్రపంచాన్ని మభ్యపెట్టేందుకే ఈ ప్రయత్నాలు."

-సువ్రో కమల్​ దత్తా, విదేశీ వ్యవహారాల నిపుణులు

పాక్​ అజెండా స్పష్టంగా ఉందని.. ఉగ్రదేశంగా ముద్ర పడకుండా ఉండేందుకే ఉగ్రవాద కార్యకలపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతుందంటున్నారు దత్తా. కానీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. పాక్​ గడ్డపై ఆశ్రయం పొందుతూ భారత్​లో విధ్వంసానికి రహస్య కార్యాచరణ రూపొందిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తోందని విమర్శిస్తున్నారు.

"ఈ కారణంగా అంతర్జాతీయంగా.. ముఖ్యంగా ఎఫ్​ఏటీఎఫ్​​ సమావేశంలో పాక్​ వక్రబుద్ధిని భారత్ బయటపెట్టాలి. అదే సమయంలో ఎఫ్​ఏటీఎఫ్ పాక్​ను బ్లాక్​లిస్ట్​లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి."

-సువ్రో కమల్​ దత్తా, విదేశీ వ్యవహారాల నిపుణులు

ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై పాక్​ ద్వంద్వ విధానాలను పలు నివేదికలు బయటపెడుతున్నాయి. ఓవైపు ఎఫ్​ఏటీఎఫ్​​ కత్తి మెడపై వేలాడుతున్నా.. అదేం పట్టించుకోకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. అండవరల్డ్​ డాన్ దావూద్​ ఇబ్రహీం, పాక్ కేంద్రంగా పనిచేసే ఖలిస్థాన్ జిందాబాద్​ ఫోర్స్​ ఉగ్రవాది రంజీత్​ సింగ్ నీతా వంటి వారిని దేశంలోనే మహరాజుల్లా చూసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం పాక్ వైఖరిపై ​ఆందోళన వ్యక్తం చేస్తోనట్లు తెలుస్తోంది.

"చాలా కాలంగా పాక్​ గ్రే జాబితాలోనే ఉంది. నా దృష్టిలో ఆ దేశం ఎఫ్​ఏటీఎఫ్​​ నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవటంలో విఫలమైంది కాబట్టి ఆ జాబితా నుంచి తొలగించాలి. ఆ దేశంపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే పాక్​ తన తప్పులు సరిదిద్దుకోవాలి. ముందుగా ఉగ్రవాదానికి నిధులు అందించటం, మాదక ద్రవ్యాలు, వాటితో ఉగ్రవాదుల సంబంధాలపై చర్యలు తీసుకునేలా చూడాలి. అలాగే, ముంబయి పేలుళ్లు, పార్లమెంట్​పై దాడికి సూత్రదారులు, వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​పై దాడికి బాధ్యులు, లండన్​ ట్యూబ్​ రైల్​ పేలుళ్లకు పాల్పడ్డవారిపై కఠిన వ్యవహరించేలా ఒత్తిడి పెంచాలి. పాకిస్థాన్ ఈరోజు వరకు లష్కరే తొయిబా. హర్కతుల్​ అన్సర్​, జైషే మహమ్మద్​ సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు."

-సువ్రో కమల్​ దత్తా, విదేశీ వ్యవహారాల నిపుణులు

అంతర్జాతీయంగా పలు దేశాలు గుర్తించిన బ్లాక్​లిస్ట్​లోని ఉగ్రసంస్థలు, ఐరాస గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎఫ్​ఏటీఎఫ్ పాక్​కు సూచించింది. కానీ, పాక్​ ఇప్పటివరకు ఎటువంటి ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే అంతర్జాతీయ సమస్యగా మారిన ఉగ్రవాదంపై నిర్ణయాలకు పాకిస్థాన్​కు చాలా సమయమిచ్చిందని, ఇక ఎట్టి పరిస్థితుల్లో పాక్​ను బ్లాక్​లిస్ట్​లోకి చేర్చాల్సిందేనని దత్తా డిమాండ్​ చేస్తున్నారు.

మొత్తంగా పాకిస్థాన్​ ప్రభుత్వం 21మంది ఉగ్రవాదులకు వీఐపీ భద్రతతో ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్ ఇప్పటికే ఉగ్రవాదంపై పాకిస్థాన్​ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు బయటపెట్టింది. భారత్​లో దాడులకు తెగబడేందుకు ముష్కర మూకలకు శిక్షణనిస్తూ.. వారికి ఆయుధాలు సరఫరా చేస్తుందని స్పష్టం చేస్తోంది.

ఇదీ చూడండి:దావూద్​ సహా 21 మంది ఉగ్రవాదులకు పాక్​ వీఐపీ భద్రత!

ఆర్మీ నివేదికల ప్రకారం గత నెలలో పాకిస్థాన్​.. మరో 88మంది ఉగ్రసంస్థలకు చెందిన నేతలు, సభ్యులపై కఠిన ఆంక్షలు విధించామని యూఎన్​ భద్రతామండలికి వెల్లడించింది. ఈ తరహా చర్యలు చేపడుతూ పాక్​.. ఎఫ్​ఏటీఎఫ్​​ నిషిద్ధ జాబితా నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతోంది. అందుకే ఆంక్షలు అని చెబుతున్నా.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటకు వెల్లడించడం లేదు. అక్టోబర్​లో జరిగే ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్ సమావేశంలో తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బిల్లులు సైతం ప్రవేశపెడుతోంది.

ఇదే ధోరణితో అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు.. భారత పౌరులు కొంతమందిని అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించాలని మొరపెట్టుకుంటోంది. మొత్తంగా పాక్​లో నక్కిన ఉగ్రవాదులు, వారి స్థావరాలు, కార్యకలపాలపై.. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్​ఐకు పూర్తి అవగాహన ఉందంటున్నారు విశ్లేషకులు.

పాకిస్థాన్ 2018 జూన్​ నుంచి గ్రే జాబితాలో కొనసాగుతోంది. జూన్​ 2020లోపు నిర్దేశిత చర్యలు చేపట్టాలని ఎఫ్​ఏటీఎఫ్ ఫిబ్రవరిలోనే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఉగ్రకార్యకలాపాలను పర్యవేక్షించే ఆసియా-పసిఫిక్​ గ్రూప్​.. ఏపీజీ సైతం సెప్టెంబర్​ 15-16న నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఉగ్రవాద నిర్మూలనకు, నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 27 అంశాల కార్యాచరణ ప్రణాళికలో.. ఇంకా 13 అంశాలపై చర్యలు తీసుకోలేని స్పష్టం చేసింది. అయితే, చైనా.. పాకిస్థాన్​కు అండగా నిలబడింది.

ఇదీ చూడండి:ఉగ్రవాదులపై పాక్ కొరడా- 88 సంస్థలపై కఠిన ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details