పాకిస్థాన్-చైనా... ఈ రెండు ఆసియ దేశాల మధ్య ఉన్న మైత్రి ప్రపంచ దేశాలకు తెలిసిన విషయమే. ప్రపంచ దేశాలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా.. చైనా అండతో పాకిస్థాన్ బయటపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇందుకు కృతజ్ఞతగా చైనాకు పాకిస్థాన్ కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇందులో మొదటిగా చెప్పుకునేది సీపెక్(చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్). సొంత దేశంలోనే ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత ఎదురవుతున్నా.. పాక్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. తన వద్ద ఉన్న ద్వీపాలను కూడా చైనాకు అప్పజెప్పాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ఇందుకు మరింత బలం చేకూరుస్తోంది.
ఏంటి ఈ ఆర్డినెన్స్?
కరాచీకి దక్షిణాన.. బుందల్, భుద్దో అనే రెండు ద్వీపాలు ఉన్నాయి. ఇవి కొంత కాలం ముందు వరకు సింధ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఉండేవి. వీటిని అభివృద్ధి చేసే విషయంపై ప్రణాళికలు రూపొందించేందుకు సంబంధించిన పీఐడీఏ(పాకిస్థాన్ ఐల్యాండ్ డెవెలప్మెంట్ అథారిటీ) ఆర్డినెన్స్పై గత నెలలో సంతకం చేశారు ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.
ఇదీ చూడండి:-గిల్గిత్ బాల్టిస్థాన్లో పాక్ సర్కారుకు నిరసన సెగ
ఈ ఆర్డినెన్స్పై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. సీపెక్లో భాగంగా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ద్వీపాలను చైనాకు అమ్మేయడానికే పాక్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
సింధ్, బలూచిస్థాన్లో నేతలు ఈ ఆర్డినెన్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుటటో జర్దారీతో పాటు అనేక మంది రాజకీయ నేతలు ప్రభుత్వ చర్యలను అక్రమమని అభివర్ణిస్తున్నారు. తమ భూములను చైనా కమ్యూనిస్ట్ పార్టీకి అమ్మితే సహించబోమని తేల్చి చెబుతున్నారు.
సేవ్ ఐల్యాండ్స్...
పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 'సేవ్ సీ ఐల్యాండ్స్' ఉద్యమాన్ని ప్రారంభించింది పాకిస్థాన్ ఫిషర్ఫోక్ ఫోరమ్(పీఎఫ్ఎఫ్). దేశంలోనే అతిపెద్ద మత్య్సకారుల యూనియన్గా పేరొందిన ఈ పీఎఫ్ఎఫ్.. ద్వీపాల అమ్మకంపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపేందుకు సన్నద్ధమవుతోంది.