తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా పర్యటనలో... పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ - హఫీజ్​ సయీద్​

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ శనివారం అమెరికాకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో సమావేశమవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ అంశంతో పాటు పాక్​కు సైనిక సహాయం అందించాలని ట్రంప్​ను కోరనున్నారు ఇమ్రాన్.

అమెరికా పర్యటనలో....పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​

By

Published : Jul 21, 2019, 5:13 AM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆహ్వానం మేరకు పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ ​ శనివారం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. సోమవారం ఆయన అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో సమావేశం కానున్నారు. ఆ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే ధ్యేయంగా ఇద్దరు నేతలు చర్చలు జరుపనున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకు ముందు పాకిస్థాన్​పై బహిరంగ విమర్శలు చేశారు. పాక్...​ అమెరికాకు అబద్ధాలు చెప్పి, మోసానికి పాల్పడింది తప్ప ఏ మేలు చేయలేదని ఆరోపించారు. పాక్​కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేశారు. ఉగ్రవాద నిర్మూలనకు మరింత కృషిచేయాలని హెచ్చరించారు. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్​ఖాన్​ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఘనస్వాగతం..

పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​తో పాటు ఆ దేశ ఆర్మీ చీఫ్​ జనరల్ కమర్​ జావేద్ బజ్వా, ఐఎస్​ఐ చీఫ్​ లెఫ్టినెంట్ జనరల్ ఫయేజ్​ హమీద్​ కూడా మూడు రోజుల అమెరికా పర్యటన కోసం వెళ్లారు. వీరంతా ఖతార్​ ఎయిర్​వేస్​కి చెందిన ఓ వాణిజ్య​ విమానంలో అమెరికాకు చేరుకున్నారు. ఇమ్రాన్​ఖాన్​కు.. విదేశాంగమంత్రి షా మొహమూద్​ ఖురేషీతో పాటు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న పాకిస్థానీ​ అమెరికన్లు స్వాగతం పలికారు.

ప్రభుత్వ ఖర్చులు తగ్గించే అంశంలో భాగంగా ఇమ్రాన్​ఖాన్​ పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్​ఖాన్ అధికారిక నివాసంలో బస చేస్తారు.

ట్రంప్​తో భేటీ..

సోమవారం శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్​తో జరిగే సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు ఇమ్రాన్.

ఈ భేటీలో ఆఫ్ఘనిస్థాన్​తో శాంతి చర్చలు, ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్​ తీసుకుంటున్న చర్యలను ట్రంప్​నకు వివరించనున్నారు ఇమ్రాన్​. సైనిక (ఆర్థిక) సహాయం పునరుద్ధరణ అంశాన్నీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు . భారత్​తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గేలా పాక్​ తీసుకున్న చర్యలనూ వివరించే అవకాశం ఉందని సమాచారం.

జూలై 23న తిరుగుప్రయాణం లోపు అమెరికా హౌస్ స్పీకర్​ నాన్సీ పెలోసీతోనూ ఇమ్రాన్​ఖాన్​ సమావేశమవుతారు.

ఉగ్రవాదులపై చర్యలు

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆర్థికసాయం అందకుండా చర్యలు చేపట్టింది. జమాత్​ ఉద్​ దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్​ సయీద్​పై కేసులు నమోదు చేసింది. ఆఫ్ఘనిస్థాన్​తో శాంతి చర్చలకు కృషి చేస్తోంది. భారత్​, అమెరికా ఆందోళనలను శాంతింపజేయడానికే ఇమ్రాన్​ఖాన్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది.

సౌదీ యువరాజు చొరవతోనే...

ట్రంప్​, ఇమ్రాన్​ఖాన్​ల సమావేశం ఏర్పాటుచేయడంలో సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్​ సల్మాన్​ కీలకపాత్ర పోషించారని ఎక్స్​ప్రెస్ ట్రిబ్యూన్​ పేర్కొంది. సౌదీ యువరాజుకు.. ట్రంప్​ అల్లుడు కుష్నర్​తో ఉన్న వ్యక్తిగత స్నేహాన్ని ఉపయోగించి.. ఈ ఇరువురు నేతల భేటీకి ఏర్పాటు చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.

ఇదీ చూడండి: ఫ్లోరిడాలో సంగీతంతో భయపెడుతున్న బీచ్​ అధికారులు

ABOUT THE AUTHOR

...view details