తెలంగాణ

telangana

By

Published : May 12, 2020, 5:07 PM IST

ETV Bharat / international

భారత్​ నుంచి ఔషధాల పేరిట పాక్​లో అక్రమాలు

భారత్​ నుంచి 450కి పైగా ఔషధాలను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​. ఔషధాల దిగుమతిపై ప్రభుత్వం సడలించిన ఆంక్షలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

pak latest news
భారత్​ నుంచి ఔషధాల దిగుమతిపై విచారణకు ఇమ్రాన్ ఆదేశం

ప్రాణాలను కాపాడే కీలక డ్రగ్స్​​ను భారత్​ నుంచి దిగుమతి చేసుకునే ముసుగులో విటమిన్ ట్యాబ్లెట్ల వంటి 450కి పైగా ఔషధాలను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారని పాకిస్థాన్ ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై దర్యప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​.

ఏం జరిగింది?

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం భారత్​తో అన్ని సంబంధాలు రద్దు చేసుకుంటున్నట్లు ఆగస్టు 9న ప్రకటించింది పాక్ ప్రభుత్వం. కీలక ఔషధాలు, వాటి ముడి పదార్థాల దిగమతిని నిలిపివేస్తే అనేక మందికి ప్రాణముప్పు ఉందని ఔషధ పరిశ్రమలు పాక్​ ప్రభుత్వాన్ని హెచ్చరించిన అనంతరం కొన్ని డ్రగ్స్​ను మాత్రమే దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది.

అయితే ఈ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, 450కిపైగా ఇతర ఔషధాలను భారత్​ నుంచి దిగుమతి చేసుకుంటున్నారని పాక్ ప్రతిపక్షం పదే పదే ఆరోపణలు చేసింది. విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. అందుకు సానుకూలంగా స్పందించారు ఇమ్రాన్.

పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం భారత్​ నుంచి అనేక విటమిన్లు, డ్రగ్స్​ను దిగుమతి చేసుకుంటున్నట్లు డాన్ మీడియా తెలిపింది. విటమిన్​ బీ1, బీ2, బీ6, బీ12, డీ3, జింక్ సల్ఫేట్​ మోనో హైడ్రేట్లు సహా అనేక ఔషధాలు భారత్​ నుంచి దిగుమతి అవుతున్నట్లు పాక్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం చేసిన పత్రంతో స్పష్టమైంది.

ABOUT THE AUTHOR

...view details