తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2019, 5:42 AM IST

ETV Bharat / international

'దలైలామా వారసుడు చైనా నుంచే రావాలి'

దలైలామా వారసుణ్ని కచ్చితంగా చైనా నుంచే ఎన్నుకోవాలని స్పష్టం చేసింది డ్రాగన్​ దేశం. ఇందుకు భిన్నంగా భారత్‌ జోక్యం చేసుకొంటే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించింది.

'దలైలామా వారసుడు చైనా నుంచే రావాలి'

దలైలామా వారసుడి ఎంపికలో భారత్ జోక్యం చేసుకోకూడదని చైనా స్పష్టం చేసింది. తమ దేశం నుంచే దలైలామా వారసుణ్ని ఎన్నుకోవాలని డ్రాగన్​ అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ విషయంలో భారత్​ జోక్యం చేసుకుంటే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని టిబెట్‌లో ఉప మంత్రి హోదాలో ఉన్న అధికారి వాంగ్ నెంగ్ షెంగ్ వెల్లడించారు. లాసాలోని భారత జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

‘" దలైలామా వారసుడి ఎంపిక చారిత్రక, రాజకీయ అంశం. దీనికోసం చారిత్రక సంస్థలను, విధానాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. దలైలామ పునర్జన్మ అనేది ప్రస్తుత లామా వ్యక్తిగత ఇష్టం కాదు. అలాగని విదేశాల్లో ఉండే కొంది మంది అభీష్టం కానేకాదు. "
-వాంగ్‌, టిబెట్‌ ఉప మంత్రి, అటానమస్‌ రీజియన్‌ డైరెక్టర్‌ జనరల్‌

దాదాపు 200 ఏళ్ల చారిత్రక నేపథ్యమున్న దలైలామా ఎంపిక విషయంలో తొలిసారి చైనా నుంచి కచ్చితమైన ప్రకటన వెలువడటం గమనార్హం.

1959లో భారత్‌కు దలైలామా

1959లో ప్రస్తుత దలైలామా భారత్‌కు వలస వచ్చి ఆశ్రయం పొందారు. ఆయనతోపాటు మరికొందరు మనదేశానికి వచ్చారు. ఆ సమయంలో భారత్‌ వారికి రాజకీయ ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి వీరు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 84 సంవత్సరాలు నిండాయి. అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు. అందుకే దలైలామా వారసుడి ఎంపికపై చైనా ఆత్రంగా ఎదురు చూస్తోంది.

ABOUT THE AUTHOR

...view details