తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా నుంచి మరొక వైరస్​.. ఇది అంతకుమించి!

ప్రస్తుతం కరోనా వైరస్​తోనే​ ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. మరో కొత్త వైరస్​ను గుర్తించినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు సోకడానికి అవసరమైన లక్షణాలన్నీ ఈ వైరస్​కు ఉన్నట్లు తెలిపారు. మరి ఆ కొత్త వైరస్​ ఏంటో? దానిని ఎలా గుర్తించారో తెలుసుకుందాం.

By

Published : Jun 30, 2020, 12:24 PM IST

Updated : Jun 30, 2020, 2:07 PM IST

New swine flu virus strain with "pandemic potential" identified in China: Study
కరోనా తర్వాత రాబోయే మహమ్మారి ఇదేనా?

కరోనా మహమ్మారితో ఇప్పటికే ప్రపంచమంతా బెంబేలెత్తిపోతుంటే.. చైనా పరిశోధకులు మరో చేదు విషయం చెప్పారు. రాబోయే కాలంలో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన 'ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌' జర్నల్‌లో వారి పరిశీనలను ప్రచురించారు.

ఏంటీ కొత్త వైరస్‌..

ఇప్పుడు పరిశోధకులను కలవరానికి గురిచేస్తున్న ఈ వైరస్‌కు జీ-4గా నామకరణం చేశారు. 2009లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ జాతి నుంచే ఇది ఉద్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు. "మనుషులకు సోకడానికి అవసరమయ్యే లక్షణాలన్నీ ఈ వైరస్‌లో ఉన్నట్లు గుర్తించాం" అని అధ్యయనంలో పాల్గొన్న చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు, చైనా 'వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం'(సీడీసీ) శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇలా గుర్తించారు..

2011 నుంచి 2018 మధ్య చైనాలోని పది రాష్ట్రాల్లో ఉన్న వివిధ జంతువధశాలలు, పశువైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి దాదాపు 30 వేల నమూనాలను సేకరించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ నిర్ధరణ పరీక్షల్లో తీసుకుంటున్నట్లుగా నమూనాలను పందుల ముక్కుల్లో నుంచే తీసుకున్నారు. అనంతరం వాటిపై పరిశోధనలు జరపగా.. దాదాపు 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైరస్‌లను కనుగొన్నారు. వీటితో ఫెర్రెట్‌ అనే ముంగిస జాతికి చెందిన జంతువుపై ప్రయోగాలు చేశారు. వైరస్‌లు సోకినప్పుడు మనుషుల్లో కనబడే లక్షణాలే దాదాపు ఫెర్రెట్‌లోనూ కనిపిస్తుంటాయి. అందుకే ఫెర్రెట్‌పై ప్రయోగాలు జరుపుతుంటారు. కొత్తగా కనుగొన్న వైరస్‌లన్నింటిలోకెల్లా జీ-4 వైరస్‌ ఫెర్రెట్‌లో ప్రమాదకర లక్షణాలు చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే మానవ కణాల్లోనే ఇది వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు గమనించారు.

ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా..

పందులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే ప్రతి 10 మందిలో ఒకరికి ఈ కొత్త వైరస్‌ ఇప్పటికే సోకిందని అధ్యయనంలో తేలింది. వారిపై యాంటీబాడీ పరీక్షలు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని బట్టి ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్లు నిర్ధరణకు వచ్చారు. ఇలా మనుషులకు సంక్రమిస్తుండడం వల్ల మానవ శరీరంలో ఇది మరింత శక్తిమంతంగా వృద్ధి చెందేలా కాలక్రమంలో రూపాంతరం చెందే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా.. లేదా.. అన్న అంశంపై మాత్రం ఇంకా లోతైన పరిశోధన జరగాల్సి ఉంది. ఇలా జరిగితే సమీప భవిష్యత్తులో మరో మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వచ్చే ఫ్లూల వల్ల ఇప్పటికే మనుషుల్లో ఏర్పడ్డ రోగ నిరోధక శక్తి.. జీ-4 నుంచి కాపాడే అవకాశం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ముప్పు ముమ్మరమవుతోంది..

మానవ అవసరాలను అనుగుణంగా జరుగుతున్న జంతు పోషణ వల్ల మనుషులకు నిరంతరం ముప్పు పొంచి ఉంటుందన్న విషయాన్ని తాజా అధ్యయనం నొక్కి చెబుతోందని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని పశువైద్య విభాగం అధిపతి జేమ్స్‌ వుడ్‌ అభిప్రాయపడ్డారు. కృత్రిమ పశుపోషణ వల్ల జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల(జూనోటిక్‌ డిసీజెస్‌) ముప్పు క్రమంగా పెరుగుతోందన్నారు.

ఇదీ చూడండి:చైనాకు వ్యతిరేకంగా కెనడాలో టిబెటన్ల 'గల్వాన్​' నిరసన

Last Updated : Jun 30, 2020, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details