నేపాల్ రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలి, కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) మధ్య విబేధాలు పరిష్కరించడంలో నేపాల్ కమ్యుూనిస్టు పార్టీ విఫలమైంది. 7 సార్లు వాయిదా తర్వాత మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో అసలు ప్రధాని ఓలి పాల్గొనకపోవడం గమనార్హం.
రాజకీయ అంశాలు చర్చించలేదు!
ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశం... కాఠ్మాండూ బలూవతార్లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో రాజకీయ అంశాలను చర్చించలేదని కమిటీ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత గణేశ్ షా పేర్కొన్నారు. దేశంలో వరదల బీభత్సం, కరోనా ఉద్ధృతిపై మాత్రమే చర్చించినట్లు తెలిపారు. తదుపరి సమావేశం ఈనెల 28న ఉదయం 11 గంటలకు జరుగుతుందని స్పష్టం చేశారు.