కరోనా వైరస్పై ప్రజలు సుదీర్ఘంగా పోరాడక తప్పదని ఉత్తర కొరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది ఎప్పటి వరకు కొనసాగించాల్సి వస్తుందో తెలియదని పేర్కొంది. కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపింది. వ్యాక్సిన్ అంతిమ పరిష్కారం కాదనేందుకు ఇదే నిదర్శమని చెప్పుకొచ్చింది.
ఉత్తర కొరియాకు వ్యాక్సిన్లు ఎప్పుడు? ఎలా? అందుతాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో ప్రభుత్వ అధికారిక వార్తా పత్రిక రొడోంగ్ సిన్మన్లో ఈమేరకు కథనం ప్రచురితమైంది.
కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఉత్తర కొరియాకు ఈ ఏడాది ద్వితీయార్థంలో 1.9 మిలియన్ల వ్యాక్సిన్లు అందుతాయని ఐరాస ఫిబ్రవరిలో ప్రకటించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరగడం, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ భారత్లో అవసరాల మేరకే సరఫరా చేస్తుండటం వల్ల టీకాల కొరత ఏర్పడిందని తెలిపింది.