మయన్మార్లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతోన్న నేపథ్యంలో మిలిటిరీ కమాండర్ ప్రజలనుద్దేశించి 20 నిమిషాల పాటు టీవీలో మాట్లాడారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోన్న నిరసనల గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం. మయన్మార్లో సైనిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిలిటిరీ కమాండర్ మాట్లాడడం ఇదే తొలిసారి.
గత ఎన్నికల్లో జరిగిన మోసాల వల్లే సైన్యం దేశాన్ని అధీనంలోకి తీసుకుందని సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ తెలిపారు. గతంలో చెప్పినట్లుగా బలగాలే కొత్తగా ఎన్నికలను నిర్వహించి విజేతలకు రాజ్యాధికారాలు అప్పజెప్తామని అన్నారు. కరోనా సమయంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చేపట్టిన చర్యలను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తీసుకున్న విధానాలను వివరించారు. సైన్యాధికారులు చేస్తోన్న ఈ ఆరోపణలను అక్కడి ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది.