Myanmar Landslides: మయన్మార్ కాచిన్ ప్రావిన్స్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 70 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. హాపాకంత్ ప్రాంతంలోని జేడ్(పచ్చరాయి) మైన్లో కూలీలు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా పేర్కొంది.
బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో అనేక మంది బురదలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దుకాణాలు సైతం ఇందులో కూరుకుపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైనవారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ఆ గనుల్లో తరచు కొండచరియలు విరిగిపడుతుంటాయి. గతేడాది జులై నెలలో జరిగిన ఇటువంటి ఘటనలోనే 174 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు.