తెలంగాణ

telangana

యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ వివాదమేంటి ?

ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వివాదాస్పద నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి రెండు దేశాలూ తీవ్రంగా గొడవ పడుతున్నాయి. ఈ ఘర్షణలు యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలెంటీ గొడవ ? దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో ఏం జరుగుతోంది ?

By

Published : Oct 4, 2020, 3:02 PM IST

Published : Oct 4, 2020, 3:02 PM IST

Armenia, Azerbaijan
యుద్ధమేఘాలు: ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య వివాదమేంటి ?

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య భీకర ఘర్షణలు జరుగుతున్నాయి. నాగోర్నో-కరాబాఖ్‌ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. ఇరు దేశాలు పరస్పర దాడులతో హడలెత్తిస్తున్నాయి.

వివాదాస్పద నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంతం భౌగోళికపరంగా అజర్‌బైజాన్‌ దేశంలో ఉంది. అయినా అజర్‌బైజాన్‌ విధానాలను వ్యతిరేకించే ఆర్మేనియా బలగాలే 1994 నుంచి దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వేర్పాటువాదుల పోరాటం తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా సెప్టెంబర్​ 27 నుంచి భీకర ఘర్షణలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఈ ప్రాంతంలో వివాదాలు, హింస చెలరేగిందిి. ఈ దేశాల మధ్య 2016 లోనూ భారీ పోరాటమే జరిగింది. ఆ సమయంలో దాదాపు 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది జులై నెలలో జరిగిన పోరులోనూ 16 మంది మరణించారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో విధ్వంసం ఎన్నడూ జరగలేదు.

పరస్పర దాడులు..

ఘర్షణల నేపథ్యంలో.. ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఆర్మేనియా బలగాలే.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి దాడికి పాల్పడ్డాయని అజర్​బైజాన్​ రక్షణ శాఖ చెబుతోంది. అజర్​బైజాన్ జరిపిన వాయు, ఫిరంగి దాడుల్లో అర్మేనియా హెలికాఫ్టర్లు, ట్యాంకులు ధ్వంసమయ్యాయని ఆరోపిస్తూ.. దేశంలో మార్షలా లా అమలులోకి తెచ్చినట్లు అర్మేనియా ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే వివాదాస్పద నాగోర్నో-కరబఖ్ సరిహద్దు వద్ద అర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్య కాల్పుల మోత మోగుతోంది. ఘర్షణలు అంతకంతకూ తీవ్రతరం అవుతూ.. యుద్ధం తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆధిపత్యం కోసం పోరాటం

ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాగమైన అర్మేనియా, అజర్​బైజాన్... సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా రెండు దేశాలుగా విడిపోయాయి. నాగోర్నో-కరాబాఖ్​పై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాయి.

దట్టమైన అడవులు, పర్వతాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం గురించి 1988 నుంచి వివాదాలున్నాయి. సోవియట్ యూనియన్​ పతనానికి ముందు.. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం అజర్​బైజాన్ నియంత్రణలో ఉండేది. అయితే, 1991లో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ లభించింది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన 1992 యుద్ధంలో ఆర్మేనియా-అజర్​బైజాన్​ భీకరంగా పోరాడాయి. ఈ యుద్ధంలో దాదాపు 30,000 మంది చనిపోయారు. 1994లో యుద్ధం అంతిమ దశకు వచ్చేనాటికి వివాదస్పద ప్రాంతంతో పాటు... దాని సమీపంలోని మడగిజ్​ను ఆర్మేనియా తన అధీనంలోకి తెచ్చుకుంది. అదే ఏడాది శాంతి చర్చల్లో భాగంగాా... ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ, ఉద్రిక్తతలు సమసిపోలేదు. ప్రాంతం అజర్​బైజాన్​లో ఉన్నా... పట్టు ఆర్మేనియన్లది ఉండటం సమస్యగా మారింది.

ఈ ప్రాంతం కాకసస్ పర్వతాల మధ్య.. 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఆర్మేనియా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భీకరంగా మారిన ఘర్షణలు

ప్రస్తుతం భీకరంగా జరుగుతున్న ఘర్షణల్లో.. ఇరువైపులా మరణాలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు. తాజాగా తమ సైన్యం ఈ ప్రాంతంలోని మడగిజ్​తో పాటు, మరో ఏడు గ్రామాలను స్వాధీనం చేసుకుందని అజర్​బైజాన్​ అధ్యక్షుడు ఇల్హం అలియెవ్​ వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 150 మంది మరణించారని నాగోర్నో- కరాబాఖ్‌ ప్రాంత అధికారులు ప్రకటించారు. ఈ పోరాటంలో దాదాపు 3,000మంది అజర్​బైజాన్​ సైనికులు మరణించినట్లుగా ఆర్మేనియా వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో 2,300 మంది ఆర్మేనియా సైనికులు క్షతగాత్రులవ్వగా వీరిలో కొంతమంది మరణించారని... అలాగే, భారీగా యుద్ధపరికరాలకు నష్టం జరిగినట్లుగా ప్రకటించింది అజర్​బైజాన్​ రక్షణ శాఖ.

ఈ ఘర్షణల్లో టర్కీ సైతం పాల్గొంటుందని ఆర్మేనియా ఆరోపిస్తోంది. అజర్​బైజాన్​ తరఫున పోరాడుతున్న టర్కీ యుద్ధ విమానం ఎఫ్​-16ను నేలకూల్చామని ప్రకటించింది.

పాకిస్థాన్​ పాత్ర

ఈ ఘర్షణల్లో అజర్​బైజాన్​కు అండగా పాకిస్థాన్​ బలగాలు పోరాడుతున్నట్లు తెలుస్తోంది. అగ్డాం ప్రాంతంలో పలు గ్రామాల్లో పాక్ సైనికులు... అర్మేనియా దళాలపై దాడులకు తెబడున్నాయని స్థానిక మీడియా చెబుతోంది.

ఘర్షణల్లో టర్కీ..

ఇరు దేశాల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న వివాదంలోకి టర్కీ తలదూరుస్తోందని ఆర్మేనియా ఆరోపిస్తోంది. అజర్​బైజాన్​కు ఎఫ్​-16 యుద్ధవిమానాలు సరఫరా చేస్తుందని చెబుతోంది. అయితే, ఈ వ్యాఖ్యలను టర్కీ ఖండిస్తుండగా.. అజర్​బైజాన్​ తమ వద్ద ఎఫ్​-16 జెట్లు లేని చెబుతోంది. ఒకవేళ అజర్​బైజాన్​ సాయం కోరితే... తాము సిద్ధంగా ఉన్నామని టర్కీ ప్రభుత్వం ప్రకటించింది.

శాంతి చర్చలు ?

ఇప్పటికే కరోనాతో ప్రపంచం కకావికలమైన నేపథ్యంలో... ఇరు దేశాలు సంయమనం పాటించాలని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రపంచదేశాల నేతలు సూచిస్తున్నారు. ఇరు దేశాలను చర్చల దిశగా నడిపించేందుకు ఐరోపా పెద్దలు చూస్తున్నారు. ఇప్పటికే ఫ్రెంచ్​ అధ్యక్షుడు మెక్రాన్​.. శాంతి చర్చలు ప్రతిపాదించారు. ఫాన్స్​తో కలిసి.. రష్యా, యూఎస్​ సంయుక్తంగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఇదీ చూడండి:ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ మధ్య భీకర పోరు

ఇదీ చూడండి:ఆ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు.. 23 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details