తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2020, 12:14 PM IST

ETV Bharat / international

చైనాలో మరో వ్యాధి- వేల మందికి పాజిటివ్

చైనాలో మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. వేలాది మంది ప్రజలకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధరించారు. బాధితులకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని లక్షణాలు దీర్ఘకాలం పాటు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Know about China's fresh bacterial outbreak brucellosis
చైనాలో మరో వ్యాధి- వేల మందికి పాజిటివ్

చైనాలో పుట్టిన కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతటినీ ఆవహించి విలయతాండవం చేస్తోంది. ఈ ప్రకంపన నుంచి బయటపడక ముందే చైనాలో మరో వ్యాధి బెంబేలెత్తిస్తోంది. వాయవ్య చైనాలోని లాంఝౌ ప్రాంతంలో బ్రుసెల్లొసిస్ అనే వ్యాధి ప్రబలుతోంది. ఇటీవల వేలాది మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గతేడాది ఓ బయోఫార్మాస్యుటికల్స్ సంస్థలో లీకేజీ ప్రమాదం తర్వాత బ్రుసెల్లోసిస్ వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధిని మాల్టా జ్వరం, మధ్యధరా జ్వరంగా పిలుస్తున్నారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ వ్యాధి సోకిన వ్యక్తులకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దీని ద్వారా మరికొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) పేర్కొంది. ఆర్థరైటిస్, అవయవ వాపు వంటి కొన్ని లక్షణాలు దీర్ఘకాలిక సమస్యలుగా మారే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఒకరి నుంచి మరొకరికి ఇది సోకే అవకాశం చాలా తక్కువ అని స్పష్టం చేసింది. కలుషితమైన ఆహారం తీసుకోవడం లేదా గాలిలోని బ్యాక్టీరియాను పీల్చుకోవడం వల్లే చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారని తెలిపింది.

సీఎన్​ఎన్ రిపోర్ట్

లాంఝౌలోని హెల్త్ కమిషన్ ప్రకారం 3,245 మంది ప్రజలకు ఈ వ్యాధి సోకిందని సీఎన్​ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది. బ్రుసెల్లా బ్యాక్టీరియా సోకిన జంతువుల సాధారణంగా ఇది వ్యాపిస్తుందని తెలిపింది. మరో 1,401 మందికి ఈ వ్యాధి నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా ప్రాథమికంగా పాజిటివ్ అని తేలినట్లు పేర్కొంది. అయితే ఈ వ్యాధి కారణంగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేసింది.

నగరంలో 29 లక్షల జనాభా ఉండగా.. 21,847 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఝొంగ్ము లాంఝౌ బయోలాజికల్ ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో లీకేజీ కారణంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని సీఎన్​ఎన్ పేర్కొంది. 2019 జులై- ఆగస్టు మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపింది.

జంతువులకు ఉపయోగించే బ్రుసెల్లా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సమయంలో గడువు ముగిసిన క్రిమిసంహారకాలను, శానిటైజర్లను ఫ్యాక్టరీ ఉపయోగించిందని సీఎన్​ఎన్ పేర్కొంది. వ్యర్థ వాయువుల నుంచి మొత్తం బ్యాక్టీరియాను తొలగించలేదని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details