తెలంగాణ

telangana

ETV Bharat / international

హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్​

జపాన్​లో ప్రకృతి విలయతాండవం నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. హగీబిస్​ తుపాను సృష్టించిన వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, పడవలతో భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది. తుపాను కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 43కి చేరింది.

By

Published : Oct 14, 2019, 2:03 PM IST

Updated : Oct 14, 2019, 2:23 PM IST

హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్​

హగీబిస్ బీభత్సం నుంచి కోలుకునే యత్నాల్లో జపాన్​
విరిగిపడ్డ కొండ చరియలు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు... జలమయమైన జనావాసాలు...! హగీబిస్ తుపాను బీభత్సం అనంతరం జపాన్​లోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. మధ్య, ఉత్తర జపాన్​లో ప్రకృతి విలయానికి 43 మంది బలయ్యారు. అనేక మంది గల్లంతయ్యారు. మరెంతో మంది నిలువనీడ కోల్పోయారు.

ముమ్మరంగా సహాయ చర్యలు...

శనివారం తుపాను విరుచుకుపడిన సమయంలో ప్రాణాలు అరచేతపట్టుకుని గడిపిన ప్రజలు... ఇప్పుడు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు అయినవారి ఆచూకీ తెలియక శోకసంద్రంలో మునిగిపోయారు. వీరికి సాధ్యమైనంత సాయం అందించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

దేశవ్యాప్తంగా సహాయ చర్యల కోసం సైన్యం, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపింది ప్రభుత్వం. జలమయమైన ప్రాంతాల్లో భవనాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నవారిని హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. కొన్నిచోట్ల చిన్నచిన్న పడవల ద్వారా సహాయక సిబ్బంది వరద బాధితులను చేరుకుంటున్నారు.

బాధితుల నరకయాతన...

తుపాను బీభత్సంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. టోక్యో, మియాగీ, ఇవాటే, ఫుకుషిమా, నీగాటాలో వేలాది ఇళ్లకు కరెంట్​ నిలిచిపోయింది.
చలిపులి... అసలు సవాలు...

ఉత్తర జపాన్​లో ఈవారం ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు, సహాయ చర్యలు చేపట్టే సిబ్బందికి చలిని ఎదుర్కోవడం పెను సవాలుగా మారింది.

ఇదీ చూడండి:సిలిండర్​ పేలి కుప్పకూలిన భవనం- 12 మంది మృతి

Last Updated : Oct 14, 2019, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details