తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు - corona effect in Italy

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

Italian premier locks down entire country to stop virus
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన ఆంక్షలు

By

Published : Mar 10, 2020, 12:42 PM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్​ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని దేశాల్లో వైరస్​ ఉద్ధృతి పెరిగి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటలీ, దక్షిణ కొరియా, మంగోలియా, కెనడాలో తీవ్రమైన రవాణా ఆంక్షలు విధించాయి ఆ దేశాల ప్రభుత్వాలు. ఆంక్షల కారణంగా ఆయా దేశాల్లో జన జీవనం స్తంభించిపోయింది.

అత్యవసరమైతే తప్ప..

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇటలీ ప్రధాని గియుసేప్​ కాంటే. ఆరోగ్య దేశంగా మారేందుకు సహకరించాలని ఆ దేశ పౌరులకు సూచించారు. అందరూ సమన్వయంతో సహకరించినప్పుడే ఇది సాధ్యపడుతుందని తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి మరో 1,807 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటలీలో ఇప్పటివరకు మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 9,172కి చేరుకుంది. మృతుల సంఖ్య 463కు పెరిగింది.

దక్షిణ కొరియాలో తగ్గుముఖం

కరోనా వైరస్ తీవ్ర ప్రభావిత దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. రానురానూ ఈ దేశంలో కేసుల సంఖ్య తగ్గుతోంది. సోమవారం ఒక్కరోజు 131 కేసులు నమోదయ్యాయి. గత రెండు వారాలతో పోల్చితే ఇదే అత్యల్పం. తాజాగా మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 54కు చేరుకుంది. దక్షిణ కొరియాలో ఇప్పటివరకు 7,513 ​ కేసులు నమోదయ్యాయి.

మంగోలియాలో తొలి కేసు

మాస్కో నుంచి మంగోలియా వచ్చిన ఒక ఫ్రెంచ్​ ఇంధన సంస్థ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరించారు. అప్రమత్తమైన అక్కడ ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను విధించింది. ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపేసింది.

కెనడాలో తొలి మరణం

కెనడాలో తొలి కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. వైరస్​​ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్న అధికారులు.. అతడి వయస్సు తెలపలేదు.

ఇదీ చూడండి:ట్రంప్​కు కరోనా ముప్పు... త్వరలో పరీక్షలు?

ABOUT THE AUTHOR

...view details