తెలంగాణ

telangana

కరోనాకు విరుగుడు ఈ నీలగిరి నెక్లెస్‌!

కరోనాకు వ్యాక్సిన్​ కనిపెట్టే పనిలో పలు దేశాల పరిశోధకులు నిమగ్నమయ్యారు. అయితే ఇండోనేషియాలో వైరస్​ నియంత్రణ కోసం ఓ మొక్క ఆకులతో 'నెక్లెస్'ను తయారు చేశారు. దీనిని అరగంట సేపు ధరిస్తే వైరస్ 80 శాతం నశిస్తుందని చెబుతున్నారు.

By

Published : Jul 12, 2020, 5:38 PM IST

Published : Jul 12, 2020, 5:38 PM IST

Indonesia govt invented antivirus neck less for corona
కరోనాకు విరుగుడు.. ఈ నీలగిరి నెక్లెస్‌!

కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు అనేక దేశాలు ఔషధాలు, వ్యాక్సిన్లను రూపొందించే పనిలో ఉన్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ఇండోనేషియా మాత్రం ఓ మొక్క ఆకులతో తయారు చేసిన నెక్లెస్‌ను ధరిస్తే చాలు కరోనా వైరస్‌ నశిస్తుందని చెబుతోంది. సాక్షాత్తు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వశాఖే దీనిని ఉపయోగించడం గమనార్హం.

ఇండోనేషియాకు చెందిన ఆరోగ్య పరిశోధన & అభివృద్ధి సంస్థ బాలిట్‌బాంగ్తన్‌ నీలగిరి ఆకులతో 'యాంటీవైరస్‌ నెక్లెస్'’ను తయారు చేసింది. దీనిని మెడలో వేసుకుంటే కరోనా వైరస్‌ దరిచేరదని.. ఒకవేళ సోకినా నశించిపోతుందని ప్రకటించింది. దీనిని ధ్రువీకరించిన ప్రభుత్వం ఈ నెక్లెస్‌లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయిస్తోంది. అక్కడి మంత్రి సెహ్రుల్‌ యాసిన్‌ లింపో ఈ నెక్లెస్‌పై స్పందిస్తూ "కరోనా వైరస్‌ను చంపడానికి నీలగిరి జాతికి చెందిన 700 రకాల మొక్కలతో వీటిని తయారు చేశాం. ఈ నెక్లెస్‌ పావుగంట ధరిస్తే 42శాతం వైరస్‌ను చంపుతుంది. అరగంట ధరిస్తే 80శాతం వైరస్‌ను అంతమొందిస్తుంది. వీటిని మేం ప్రయత్నించి చూశాం. నేను పలు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నప్పుడు ఈ నెక్లెస్‌ను ధరిస్తున్నాను. ఇది బాగా పనిచేస్తోంది. బాలిట్‌బాంగ్తన్‌ యాంటివైరస్‌ నెక్లెస్‌నే కాదు, నీలగిరి మొక్కలతో ఇన్‌హీలర్‌, శానిటైజర్‌, క్రీమ్స్‌, ఆయిల్స్‌ సైతం రూపొందించింది. ఎవరికైనా కత్తి గాట్లు పడితే ఈ క్రీమ్‌ను రాసుకుంటే నయమైపోతుంది" అని చెప్పుకొచ్చారు.

నీలగిరి నెక్లెస్

ఈ యాంటీవైరస్‌ నెక్లెస్‌ను వ్యవసాయ శాఖలోని 20 మంది ఉద్యోగులపై ప్రయోగించినట్లు బాలిట్‌బాంగ్తన్‌ సంస్థ హెడ్‌ ఫడ్రీ తెలిపారు. కరోనా సోకిన ఉద్యోగులు ఈ నెక్లెస్‌ను ధరించాక వారికి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తొలిగిపోయి.. కోలుకున్నారని చెప్పారు. నీలిగిరి ఆయిల్‌ను హెచ్‌5ఎన్‌1 బర్డ్‌ ఫ్లూ, కరోనా జాతికి చెందిన వైరస్‌లను నివారించే మందుల్లో వాడొచ్చని పేర్కొన్నారు. అయితే బాలిట్‌బాంగ్తన్‌ తయారు చేసిన యాంటీవైరస్‌ నెక్లెస్‌ పనితీరుపై ఇండోనేషియన్‌ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని శాస్త్రీయత లేదని కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ యాంటీ వైరస్ నెక్లెస్‌కు ఎజిక్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మాలిక్యూలర్‌ బయోలజీ డిప్యూటీ డైరెక్టర్‌ హెరావతి సుడొయో మాత్రం మద్దతిచ్చారు. "ఇప్పటి వరకు కరోనాకు సరైన మందును కనిపెట్టలేదు. కాబట్టి ఇకపై కరోనా వ్యాప్తి చెందకుండా దీనికి వాడటంలో తప్పులేదు" అని అన్నారు.

ఇదీ చూడండి:మావోయిస్టుల దుశ్చర్య- 12 అటవీశాఖ భవనాలు పేల్చివేత

ABOUT THE AUTHOR

...view details