తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​తో శాంతినే కోరుకుంటున్నాం: మోదీ

కిర్గిస్థాన్​లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్​ ఆర్గనైజేషన్​ సమావేశం వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు దేశాల అధినేతలతో భేటీ అయ్యారు. చైనా, రష్యా, అఫ్గానిస్థాన్ అధినేతలతో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించారు.

By

Published : Jun 14, 2019, 6:04 AM IST

Updated : Jun 14, 2019, 8:20 AM IST

పాక్​తో శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నాం: మోదీ

పాక్​తో శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నాం: మోదీ

పాకిస్థాన్ ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ వద్ద ప్రస్తావించారు. షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్​ (ఎస్​సీఓ) సమావేశం వేదికగా గురువారం ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

భారత్​కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రకుట్రలను అరికట్టడంలో పాక్ తగిన విధంగా వ్యవహరించడం లేదని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. శాంతి కోసం భారత్​ చేస్తున్న ప్రయత్నాలను పాక్ వమ్ము చేస్తోందని జిన్​పింగ్​కు వెల్లడించారు. పాకిస్థాన్​తో భారత్​ శాంతియుత సంబంధాలనే కోరుకుంటోందని స్పష్టం చేశారు.

చర్చలు సానుకూలం...

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​తో సమావేశం సానూకులంగా జరిగిందని భేటీ అనంతరం మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సహకారం మెరుగుపరుచుకోవడంపై చర్చలు జరిపినట్లు తెలిపారు.

చైనాలోని వుహాన్ శిఖరాగ్ర సమావేశం జరిగిన అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాల్లో స్థిరత్వం పెరిగిందని మోదీ అన్నారు. ఒకరి సమస్యలు మరొకరు అర్థం చేసుకోగలుగుతుండటం ద్వారా నూతన రంగాల్లో సహకారానికి అవకాశం ఏర్పడిందని వివరించారు.

పరస్పరం బెదిరింపులు ఉండవు..

భారత్​, చైనాలు పరస్పరం బెదిరింపులకు పాల్పడవని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి సాధనలో ఇరుదేశాలు పరస్పర సహకార ధోరణిలో కలిసి పనిచేస్తాయని ఆకాంక్షించారు.

"మన రెండు దేశాల మధ్య నిరంతర అభివృద్ధి భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు భారత్​తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది. రెండు దేశాల మధ్య నిరంతర అభివృద్ధి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం." - జిన్​పింగ్, చైనా అధ్యక్షుడు

పుతిన్​తో మోదీ భేటీ..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో మోదీ సమావేశమయ్యారు. వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. చమురు రంగంలో మరింతగా సహకరించుకోవాలని నిర్ణయించారు.

రష్యా తూర్పు ప్రాంతంలో భారతీయ నిపుణుల సేవలను వినియోగించడం, రక్షణ రంగంలో సంబంధాలపై ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. అమేఠీలో కలష్నికోవ్​ రైఫిళ్ల తయారీ కర్మాగారం ఏర్పాటు చేస్తున్నందుకు పుతిన్​కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలోని వ్లోదివోస్తోక్​లో సెప్టెంబర్​లో జరగనున్న తూర్పు ఆర్థిక ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మోదీని పుతిన్ ఆహ్వానించారు.

ఘనీతో మోదీ సమావేశం

షాంఘై సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీతోనూ సమావేశమయ్యారు.

ఇదీ చూడండి: సముద్రంలో జవాన్​ను కాపాడిన తీరప్రాంత దళం

Last Updated : Jun 14, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details