తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2020, 7:53 PM IST

ETV Bharat / international

ఆగని కరోనా ఉద్ధృతి...17వేలు దాటిన మరణాలు

ప్రాణాంతక కరోనా.. ప్రపంచంపై పంజా విసురుతోంది. ఇప్పటివరకు వైరస్ కారణంగా 17,235 మంది మరణించారు. దాదాపు 4 లక్షల మందికి మహమ్మారి సోకింది. తాజాగా స్పెయిన్​లో మరో 514 మంది, ఇరాన్​లో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్​లో తొలి కరోనా కేసు నమోదైంది.

Global death toll from coronavirus passes 17,000
కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు వందల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకూ వివిధ దేశాల్లో 17,235 మంది మరణించగా... 3,95,807 మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ మహమ్మారి విస్తరించినట్లు తెలుస్తోంది.

చైనాలో మరో 78 కొత్త కేసులు గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఏడుగురు మరణించినట్లు వెల్లడించారు.

భౌగోళిక ప్రాంతాల వారీగా...

ఖండం/దేశం/ప్రాంతం కేసులు మరణాలు
ఐరోపా 1,99,779 10,724
ఆసియా 98,748 3,570
అమెరికా, కెనడా 48,519 523
పశ్చిమాసియా 29,087 1,966
లాటిన్ అమెరికా, కరీబియన్ 6,217 112
ఆఫ్రికా 1,788 58

514మంది

స్పెయిన్​లో కరోనా మహమ్మారి మరో 514 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 2,696కి చేరింది.

నిన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 20శాతం పెరిగి 39,673కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఫ్రాన్స్​లో మొత్తం 860 మరణాలు సంభవించగా... 19,856 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో 499 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం 46,440 మందికి కొవిడ్ సోకింది.

ఇరాన్​

వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న దేశాల్లో ఇరాన్​ ఒకటి. తాజాగా దేశంలో మరో 122 మంది కరోనాతో మరణించారు. దీంతో మృతుల సంఖ్య 1,934కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.

గత 24 గంటల్లో 1,762 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో మొత్తం 24,811 మంది ఈ వైరస్ బారిన పడ్డారని పేర్కొంది.

పాక్​లో 903కి చేరిన కేసులు

పాకిస్థాన్​లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పంజాబ్​ రాష్ట్రంలో ఈ మహమ్మారికి ఓ వ్యక్తి బలయ్యారు. ఇప్పటివరకు పాక్​లో ఏడుగురు కరోనా కారణంగా మరణించారు. దేశంలో వైరస్ కేసుల సంఖ్య 903కు చేరినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు చర్యలకు ఉపక్రమించింది ఇమ్రాన్ ప్రభుత్వం. మార్చి 31 వరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది.

తొలి కేసులు, మరణాలు

మయన్మార్​లో తొలి వైరస్ కేసు నమోదైంది. 214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఇందులో అమెరికా నుంచి తిరిగి వచ్చిన 36 ఏళ్ల వ్యక్తికి, బ్రిటన్​ నుంచి తిరిగివచ్చిన 26 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తేలిందని ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది.

ఐస్​లాండ్​లో తొలి కరోనా మరణం సంభవించింది. వైరస్​తో వృద్ధురాలు మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఆఫ్రికాలో ఇలా

దక్షిణాఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. దేశవ్యాప్తంగా 554 కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. 21 రోజుల పాటు దేశంలో లాక్​డౌన్​ కొనసాగనుంది.

ఆఫ్రికా ఖండంలోని 54 దేశాల్లో 43 దేశాలకు ఈ వైరస్ పాకింది. ఆయా దేశాల్లో మొత్తం 1,788 మందికి కరోనా సోకగా... 58 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పలు దేశాలు కట్టడి చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తూ నైజీరియా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సహకారం చేయాలని ఇథియోపియా జీ20 గ్లోబల్​ ఫోరంకు అభ్యర్థించింది. 150 బిలియన్ డాలర్ల అత్యవసర ప్యాకేజీ ఆఫ్రికాకు ప్రకటించాలని ప్రతిపాదించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details