తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాపై కరోనా పంజా- ఒక్క రోజులో 11 వేల కేసులు

మానవాళిపై కరోనా విలయం విధ్వంసకరంగా సాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 42 లక్షల మంది ఈ భయంకరమైన వైరస్ చెరలో చిక్కుకున్నారు. 34 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. సింగపూర్​ వసతి గృహాల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. అందులోని కార్మికుల్లోనే ఎక్కువ శాతం కొత్త కేసులు బయటపడుతున్నాయి. రష్యాలో వరుసగా తొమ్మిదో రోజు 10వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలు లాక్​డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి.

By

Published : May 11, 2020, 7:21 PM IST

coronavirus
కరోనా

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా నమోదైన 34 వేల కేసులతో ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 42 లక్షలు దాటింది. 15 లక్షల మందికిపైగా బాధితులు వైరస్​ నుంచి కోలుకోగా.. 2,84,382 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా మీటర్

రష్యాలో కరోనా గరళం

రష్యాలో కొద్ది రోజులుగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 11,656 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 2,21,344కి చేరింది. పదివేలకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం ఇది తొమ్మిదవసారి అని స్థానిక మీడియా తెలిపింది.

మరో 94 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 2,009కి పెరిగింది. 39,801 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 5,495 మంది డిశ్చార్జి అయ్యారు.

రాజధాని నగరం మాస్కోలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో సగానికిపైగా(1,15,909) ఇక్కడే గుర్తించారు. తాజాగా మరో 6,169 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

వసతి గృహాల వలలో సింగపూర్

సింగపూర్​లో వసతి గృహాల్లో నివసిస్తున్న విదేశీ కార్మికుల్లో వైరస్ ప్రబలుతోంది. మొత్తం 486 కేసులు నమోదు కాగా.. ఇందులో ఇద్దరు మాత్రమే సింగపూర్ పౌరులు ఉన్నట్లు వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 20,961 మంది వసతి గృహాల్లో ఉంటున్న విదేశీ కార్మికులు వైరస్ బారిన పడ్డట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 23,822కి చేరినట్లు తెలిపింది.

టెస్ట్​ కిట్లలో లోపం కారణంగా ఓ ల్యాబరేటరీలో జరిపిన 33 పరీక్షల్లో 'కరోనా పాజిటివ్' అని తప్పుగా తేలినట్లు సింగపూర్ వైద్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ల్యాబ్​లోని కార్యకలాపాలు నిలిపివేసినట్లు స్పష్టం చేసింది.

దేశంలో 20 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. వైరస్ పాజిటివ్​గా తేలిన మరో ఆరుగురు ఇతర కారణాల వల్ల మరణించినట్లు అధికారులు తెలిపారు.

ఆస్పత్రి నిర్మించేలోపే కరోనా కట్టడి!

జర్మనీలో కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫీల్డ్ ఆస్పత్రిని అధికారికంగా ప్రారంభించారు. 500 పడకల సామర్థ్యంతో అవసరమైతే రెట్టింపు పడకలను ఏర్పాటు చేసుకునే వీలున్న బెర్లిన్​లోని ఈ అధునాతన క్లినిక్​ను అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోగులు ఎవరూ లేరు.

నాలుగు వారాల క్రితం ఈ భవన నిర్మాణం ప్రారంభించారు. అయితే అంతకుముందు నుంచి కరోనా కట్టడికి జర్మనీ తీసుకున్న చర్యల ఫలితంగా ఇన్ఫెక్షన్ల రేటు తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న రోగులకు చికిత్స అందించడానికి బెర్లిన్​లోని 50 ఆస్పత్రుల్లో సరిపడా పడకలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఆంక్షల అడ్డు తొలగిస్తున్న ఆసీస్

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ ఆంక్షలను సడలించే దిశగా ఆస్ట్రేలియా అడుగులు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం తీసుకురావడానికి నిబంధనలను సడలించనున్నట్లు పలు రాష్ట్రాలు ప్రకటించాయి. కేఫ్​లు, పబ్​లు, బార్లు, రెస్టారెంట్లు పునఃప్రారంభించడానికి ప్రణాళిక ఖరారు చేశాయి. అయితే కస్టమర్ల సంఖ్య సహా బయట తిరిగే వ్యక్తుల సమూహంపై పరిమితులు విధిస్తున్నాయి.

సడలింపు ప్రక్రియ దశలవారీగా మూడు నెలల పాటు కొనసాగుతుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. వైద్య అధికారులు మాత్రం కొత్త కేసులను పర్యవేక్షిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ఆంక్షలు తొలగించే అంశంపై స్పష్టమైన మార్పులు చేసుకునేందుకు రాష్ట్రాలదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు.

నేపాల్​

నేపాల్​లో కరోనా కేసులు 121కి చేరినట్లు అధికారులు తెలిపారు. భారత్​ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన మరో 8 మంది సహా మొత్తం 11 మందికి కరోనా సోకినట్లు వెల్లడించారు. కాగా.. నేపాల్​లో ఇప్పటివరకు కరోనా మరణాలేవీ సంభవించలేదు.

ABOUT THE AUTHOR

...view details