తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆర్మేనియా- అజర్​బైజాన్​ రగడపై భారత్​ వైఖరేంటి?

సరిహద్దులోని వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్​ ప్రాంతంపై ఆధిపత్యం కోసం.. కొన్నిరోజులుగా ఘర్షణలతో హోరెత్తించాయి ఆర్మేనియా-అజర్​బైజాన్. దశాబ్దాలుగా రగులుతున్న వివాదానికి మరింత మంట రాజేసి.. కాల్పుల మోత మోగించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా.. వివాదం పూర్తిగా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి.. అచల్ మల్హోత్రా ఈ వివాదంలో భారత్​ వైఖరి గురించి ఈటీవీ భారత్​కు వివరించారు.

By

Published : Oct 16, 2020, 3:54 PM IST

rmenia-Azerbaijan conflict
ఆర్మేనియా-అజర్​బైజాన్​ వివాదంపై.. భారత్​ వైఖరేంటి ?

ఆర్మేనియా క్రైస్తవ మెజార్టీ దేశం. అజర్​బైజాన్​ ముస్లిం మెజార్టీ దేశం. ఈ ఇరుదేశాల మధ్య నాగోర్నో-కరాబఖ్ వివాదం తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇరు దేశాలు పరస్పర దాడులతో హడలెత్తించాయి. ప్రాంతంపై పట్టుకోసం దేశాలు ఘర్షణలకు తెగబడిన వేళ.. ప్రపంచ దేశాలు ఇరువర్గాలకు మద్దతుగా ముందుకొచ్చాయి. దాదాపు యుద్ధం జరిగే పరిస్థితులు తెలెత్తిన నేపథ్యంలో.. ఈ అంశంపై భారత్​ వైఖరేంటనేది ఆసక్తికరంగా మారింది.

ఈ వివాదంపై దక్షిణాసియా దేశాల అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్న పరిస్థితుల్లో.. భారత్ ఇరుగుపొరుగు దేశాలతో సమాన దూరం పాటిస్తోంది. ప్రాంతీయ శాంతి-భద్రతలకు ముప్పు కలిగించేలా.. తిరిగి మొదలైన ఆర్మేనియా-అజర్​బైజాన్​ ఘర్షణలపై దిల్లీ​ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుదేశాలు సరిహద్దులో శాంతి స్థాపనకు కృషి చేయాలని హితవు పలికింది. కాల్పుల విరమణ ఆవశ్యకత గుర్తుచేసింది.

ఈ నేపథ్యంలో.. ఆర్మేనియా-అజర్​బైజాన్​ మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసిన నాగోర్నో-కరాబఖ్ వివాదం గురించి, ఈ విషయంలో భారత్​ వైఖరి గురించి... ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి అచల్ మాల్హోత్రా ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇదీ చూడిండి: యుద్ధమేఘాలు: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ వివాదమేంటి ?

నాగోర్నో-కరాబఖ్ వివాదం.. కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య అనేక ఘర్షణలకు కారణమైంది. నాడు యూఎస్ఎస్​ఆర్​లో భాగంగా ఉన్నప్పుడు అంతా ప్రశాంతంగానే ఉన్నా.. ఆ తర్వాతే వివాదాలు మొదలయ్యాయి. ఆ ప్రాంతం తమ భూభాగమే అంటోంది అజర్​​బైజాన్. స్వతంత్ర ప్రాంతమంటున్న వేర్పాటువాదులకు మద్దతిస్తోంది ఆర్మేనియా. ఈ వివాదం సమసిపోయే సూచనలు కనిపించటంలేదు.

ఆచితూచి అడుగులు..

రెండు దేశాలూ ఈ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించటమే లక్ష్యంగా అతివాద పోకడలు అవలంబిస్తున్న నేపథ్యంలో వివాదం మరింత హింసాత్మకంగా మారుతోందంటున్నారు అచల్​ మల్హోత్రా. అజర్​బైజాన్ నమ్మిన 'ప్రాదేశిక సమగ్రత సూత్రం' విధానానికి భారత్​ సహా అనేక దేశాలు మద్దతు తెలుపుతున్నాయని విశ్లేషిస్తున్నారు. అయితే స్థానిక డిమాండ్​ ప్రకారం.. ఈ ప్రాంతం స్వేచ్ఛకు ఆర్మేనియా పోరాడుతోందని, ఈ నేపథ్యంలోనే భారత్​ ఆచితూచి వ్యవహరిస్తోందని చెబుతున్నారు.

భారత్-ఆర్మేనియా సంబంధాలతో.. భారత్​-అజర్​బైజాన్​ బంధాన్ని పోలిస్తే ఆర్మేనియాతోనే బలమైన అవగాహన ఉంది.

-అచల్​ మల్హోత్రా, ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి

కశ్మీర్​ సహా అనేక అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై ఆర్మేనియా భారత్​కు మద్దతుగా నిలవగా.. ఆదే సమయంలో అజర్​బైజాన్,​ టర్కీతో కలిసి పాకిస్థాన్​వైపు నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మల్హోత్రా.

అయితే, భారత్​ ఆర్మేనియాకు బహిరంగా మద్దతు తెలపకపోవటానికి, అదే సమయంలో అజర్​బైజాన్ విధానాలకు వ్యతిరేకంగా ప్రకటనలు విడుదల చేయకపోవటానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ వివాదాలపై భారత్ సంతులిత విధానాలనే అవలంబించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశంవైపు మద్దతుగా నిలబడకూడదనేది భారత విదేశాంగ విధానం. ప్రస్తుత పరిస్థితుల్లోనూ భారత్ తటస్థ వైఖరి అవలంబించింది.

-అచల్​ మల్హోత్రా, ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి

ఈ నేపథ్యంలో అజర్​బైజాన్​కు మద్దతు ఇవ్వకుండా ఉండేందుకు భారత్​కు అనేక కారణాలున్నాయని ఆయన వివరించారు.

ప్రాదేశిక సమగ్రత సూత్రం అంటూనే.. భారత అంతర్గత అంశమైన కశ్మీర్​ అంశంలో పాకిస్థాన్​ వాదనకు మద్దతు తెలిపింది అజర్​బైజాన్. ఇది భారత్​కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మరోవైపు భారత్ ఆర్మేనియాకు బాసటగా నిలవకపోవటానికి కారణం.. వేర్పాటువాదానికి మద్దతుగా నిలబడటం ఇష్టం లేకపోవటమే. ఎందుకంటే.. దేశంలో వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్... నైతికంగా బయటి దేశంలో ఇలాంటి చర్యకు మద్దతు తెలుపలేదు.

-అచల్​ మల్హోత్రా, ఆర్మేనియాలో భారత మాజీ రాయబారి

అదే సమయంలో శాంతి స్థాపన కోసం ఓఎస్​సీఈ మిన్స్క్ గ్రూప్ చేస్తున్న నిరంతర కృషిని భారత్​ కొనియాడిందని అచల్ మల్హోత్రా గుర్తు చేశారు.​ ఈ వివాదంలో టర్కీ సహా ఇతర దేశాల ప్రమేయానికి భారత్​ అనుకూలంగా లేదని వివరించారు.

భారత్​ దౌత్యబంధం..

మొత్తంగా, భారత్​పై ఈ వివాదం ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నారు పరిశీలకులు. ఆర్మేనియాలో భారత్​ పెట్టుబడలు పెద్దగా లేవు. వాణిజ్యం సైతం తక్కువగానే ఉంది. అజర్​బైజాన్​లో ఓఎన్​జీసీ చమురు ప్రాజెక్టులపై కొన్ని పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం నుంచి భారత్​కు చమురు, గ్యాస్​ పంపిణీ చేసే పైప్​లైన్​ వ్యవస్థ ఉంది.

అదే సమయంలో ఇరు దేశాలతో భారత్​కు దౌత్యపరంగా సత్సంబంధాలే ఉన్నాయి. అంతేకాకుండా ఐరోపా, మధ్య ఆసియా దేశాలకు సరకులు రవాణా చేసే ఉత్తర-దక్షిణ నడవా ముంబయి, చాబహార్ నుంచి అజర్​బైజాన్​ మీదుగానే మాస్కో చేరుతుంది. అంతర్జాతీయ సంబంధాలకు ఇది భారత్​కు కీలకం.

మరోవైపు ఆ ప్రాంతంలో ఆర్మేనియా ఒక్కటే భారత్​ మిత్రదేశం. 1995లో కుదిరిన సహకార ఒప్పందం మేరకు.. అజర్​బైజాన్​కు భారత్​ ఎటువంటి సైనిక సహకారం అందించకూడదు. అలాగే ఆర్మేనియాతో భారత్​కు సాంస్కృతికంగా, చారిత్రకంగా బలమైన మైత్రి బంధం ఉంది.

ఇదీ చూడండి: ఆర్మేనియా- అజర్‌బైజాన్‌ల మధ్య శాంతి పవనాలు!

ABOUT THE AUTHOR

...view details