సిగరెట్, మందు, గుట్కా... వీటికి ప్రపంచంలో ఎంతో మంది బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
యుక్త వయసులో సరదాలకు అలవాటు చేసుకుని ఇప్పుడు దూరంగా ఉండాలనుకున్నా... కుదరని పరిస్థితి. ఫలితంగా చాలా మంది తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఎన్నో చికిత్సలు పొందినా ఫలితం లేకుండాపోతోందని బాధపడతున్నారు.
చైనాలోని రుయిజిన్ ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము అందించే శస్త్రచికిత్స కచ్చితమైన ఫలితాన్ని అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ చికిత్స పేరే డీబీఎస్.
డీబీఎస్ ప్రక్రియ...
డీబీఎస్ అంటే 'డీప్ బ్రెయిన్ స్టిములేషన్'. చికిత్స ఖరీదు 25 వేల డాలర్లు. ఐదు నెలల క్రితం ఓ రోగికి ఈ చికిత్సను అందించారు. మత్తు పదార్థాలకు ఇప్పటికీ దూరంగా ఉంటున్నానని రోగి స్పష్టం చేశారు.
తొలుత రోగి మెదడుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి కొన్ని కణాలను గుర్తిస్తారు. అనంతరం శస్త్రచికిత్సతో మెదడులోకి కొన్ని చిన్న పరికరాలను పంపుతారు. ఆ పరికరాలు మెదడులోని కణాలను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి.