ఎటు చూసినా భయం భయం.. ఎవరి ముఖంలో చూసినా కలవరం. ఏదో జరిగిపోతోందనే ఆందోళన. అంతుచిక్కని వైరస్ అందర్నీ అంతం చేసేస్తుందనే వార్తలు. రోజూ వైరస్ ధాటికి వందల మంది మృతి, వేల సంఖ్యలో కేసులు.. ఇది మొన్నటి వరకు చైనా పరిస్థితి.
అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న చైనాలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క కొత్త వైరస్ కేసు నమోదైంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ప్రపంచంపై పంజా విసురుతోన్న.. కరోనా వైరస్ అంతు చూసింది చైనా.
వుహాన్లో సాధారణం...
కరోనా వైరస్కు కేంద్ర బిందువుగా భావిస్తోన్న వుహాన్ నగరంలో ఇప్పుడు దాదాపు సాధారణ స్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితి దాదాపు అదుపులోకి వచ్చింది. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిని ఇప్పటికే మూసివేశారు. వైద్యులు తమ ముఖానికి ఉన్న మాస్క్లు తీసేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వుహాన్లో మోహరించిన వేలమంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం అంచెలంచెలుగా ఉపసంహరించాలని నిర్ణయించుకుంది. కరోనా వ్యాప్తి ఇక్కడ దాదాపు అంతమైనట్లేనని ఓ వైద్య నిపుణురాలు పేర్కొన్నారు.
"మూడు నెలల నిర్విరామ పోరు తర్వాత చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు అంతిమ దశకు చేరుకుంది. అయినా ఒక నెల తర్వాతే ఈ విషయంపై మేం తుది నిర్ణయం తీసుకుంటాం. వాతావరణానికి ఈ కరోనా వైరస్కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు." - కావో వై, వైద్య నిపుణురాలు
ఆస్పత్రుల మూసివేత...
2020 జనవరి... చైనాలో వైరస్ వ్యాప్తి తారస్థాయిలో ఉంది. వుహాన్ నగరానికి దాదాపు 30,000 మందికి పైగా వైద్య సిబ్బందిని ప్రభుత్వం తరలించింది. ఇందులో సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. 14 తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. తాజాగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టండం వల్ల ఇప్పుడు ఈ ఆస్పత్రులన్నింటినీ ప్రభుత్వం మూసివేసింది.
ప్రస్తుతం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, భద్రతల దృష్ట్యా చైనాలో కరోనా వైరస్ మళ్లీ ప్రబలినా దీటుగా ఎదుర్కోగలమని ఆ దేశ వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ధాటికి చైనాలో ఇప్పటివరకు 3,226 మంది మరణించారు. 80,881 కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 7,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 145 దేశాలకు విస్తరించిన వైరస్ ధాటికి 1,81,500 కేసులు నిర్ధరణ అయ్యాయి.