తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆక్సాయిచిన్​లో సైనిక బలగం పెంచుకుంటున్న చైనా!

భారత సరిహద్దు వద్ద చైనా తన బలాన్ని పెంచుకుంటున్నట్లు ఆ దేశ వార్తా పత్రిక వెల్లడించింది. సరిహద్దు వెంబడి భారత్​ అక్రమంగా నిర్మాణాలు చేపడుతోందన్న కారణంతోనే చైనా ఈ నిర్ణయం తీసుకుందని ఓ అధికారి పేర్కొన్నట్లు వ్యాఖ్యానం ప్రచురించింది.

By

Published : May 19, 2020, 7:00 AM IST

china aksai chin
చైనా ఆక్సాయిచిన్​

భారత్​ సైన్యంతో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనా అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆక్సాయిచిన్​ పరిధిలోని గాల్వన్​ లోయ ప్రాంతంలో తన సైనిక బలాన్ని పెంచుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు సరిహద్దు నియంత్రణ చర్యలను చైనా సైన్యం ముమ్మరం చేసినట్లు... ఆ దేశానికి చెందిన గ్లోబల్​ టైమ్స్​ పత్రికలో గుర్తుతెలియని సైనిక అధికారి పేరుతో ఓ వ్యాఖ్యానం ప్రచురితమైంది.

'చైనా భూభాగంలోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్​ అక్రమ సైనిక నిర్మాణాలు చేపట్టిన కారణంగా చైనా ఈ చర్యలకు పూనుకుందని' వ్యాఖ్యానంలో సైనిక అధికారి పేర్కొన్నారు. 'మే నెలలో గాల్వన్ లోయ ప్రాంతం నుంచి భారత సైన్యం​ అనేక సార్లు సరిహద్దు దాటి వచ్చిందని' ఆరోపించారు. చైనా సరిహద్దులోని సైన్యానికి ఆటంకం కలిగించేలా భారత్​ నిర్మాణాలు చేపడుతోందని వ్యాఖ్యానించారు.

అయితే ఈ కథనాలపై అటు భారత విదేశాంగ శాఖ గానీ, సైనిక అధికారులు గానీ స్పందించలేదు.

సాధారణమే

మరోవైపు.. సరిహద్దుపై తగిన అవగాహన లేకపోవడం వల్ల ఇరు దేశాల సైనికులు పొరపాట్లు చేస్తుంటారని దిల్లీలోని ఓ సైన్యాధికారి స్పష్టం చేశారు. సరైన సరిహద్దు లేని ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతాయని చెబుతున్నారు.

ఇటీవల ఘర్షణలు

భారత్​- చైనాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు మే 5న తూర్పు లద్దాఖ్​ వద్ద ఘర్షణ పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకోవడం సహా రాళ్లు రువ్వుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఉత్తర సిక్కింలోని నకులా పాస్​ వద్ద ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అయితే ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగించాలనే కోరుకుంటున్నట్లు భారత్​ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details