తెలంగాణ

telangana

ETV Bharat / international

'బెదిరింపులు ఆపండి'- అమెరికాకు చైనా హెచ్చరిక!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ నేతృత్వంలో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు ఇదివరకెన్నడూ ఎరుగని విధంగా క్షీణించాయి. తాజాగా డ్రాగన్​ దేశానికి చెందిన మరో 59 కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్ట్​లో చేర్చడంపై చైనా మండిపడింది. బెదిరింపు చర్యలు ఆపాలని...లేకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.

By

Published : Dec 21, 2020, 6:29 AM IST

China-after-US-blacklists-companies
బెదిరింపులు ఆపండి.. అమెరికాకు చైనా హెచ్చరిక!

చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశ కంపెనీలపై ఆంక్షలను విధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా మిలటరీతో సంబంధం ఉందనే ఆరోపణలతో పలు కంపెనీలపై అమెరికా ఇప్పటికే నిషేధం విధించింది. తాజాగా మరో 59 కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంపై స్పందించిన చైనా.. ఇకనైనా బెదిరింపు చర్యలను ఆపాలని అమెరికాకు సూచించింది. లేకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.

చైనాకు చెందిన అతిపెద్ద చిప్‌ తయారీ సంస్థ ఎస్‌ఎంఐసీపై ఆంక్షలు విధించడాన్ని చైనా పరిశ్రమల శాఖ తప్పుబట్టింది. విదేశీ కంపెనీలను అణచి వేయడానికి ఎగుమతి నియంత్రణలు, ఇతర చర్యలను అమెరికా దుర్వినియోగ పరుస్తోందని ఆక్షేపించింది. ఇలాంటి బెదిరింపులు, ఏకపక్షవాదాన్ని వెంటనే ఆపివేయాలని అమెరికాకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలో చైనా కంపెనీల హక్కులను పరిరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పరిశ్రమల శాఖ స్పష్టంచేసింది.

అధ్యక్ష పదవీకాలం ముగియడానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై ప్రతీకార చర్యలను పెంచుతూనే ఉన్నారు. ట్రంప్‌ నేతృత్వంలో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు ఇదివరకెన్నడూ ఎరుగని విధంగా క్షీణించాయి. ఇక తాజా ఆంక్షలతో ద్వారా దాదాపు 77 విదేశీ కంపెనీలను అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో దాదాపు 59 సంస్థలు చైనాకు చెందినవి కాగా మిగతావి బల్గేరియా, ఫ్రాన్స్‌, పాకిస్థాన్‌ దేశాలకు చెందిన కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. ఇక అమెరికా చట్టాలను అమలుచేయడంలో విఫలమైతే స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్‌ చేసే చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా సంతకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details