చైనాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. విదేశాల వస్తున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా దేశంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.
చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,827కు చేరింది. వీరిలో 77,394 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4,632 మంది మరణించారు. 10 రోజులుగా ఎవరూ చనిపోయినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్హెచ్సీ) నిర్ధరించలేదు.
విదేశాల నుంచి..
చైనాలో శనివారం నమోదైన 11 కేసుల్లో ఐదు విదేశాల నుంచి వచ్చినవారిగా గుర్తించారు అధికారులు. మిగిలిన ఆరు స్థానికంగా సంక్రమించినట్లు నిర్ధరించారు.
కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన వుహాన్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినా... విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కేసులు, లక్షణాలు లేని కరోనాతో వైద్య నిపుణులు మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తిరగ తోడుతున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటికీ తీవ్రంగా శ్రమిస్తోందని ఎన్హెచ్సీ అధికార ప్రతినిధి మిఫెంగ్ పేర్కొన్నారు.