సరిహద్దుల్లో చైనా కుయుక్తులు కొనసాగుతున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపం నుంచి అధిక సంఖ్యలో బలగాలను వెనక్కి రప్పించుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ ఓ వైపు నీతులు వల్లిస్తూనే.. ఆ దేశం ఎల్ఏసీకి చేరువగా అదనపు బలగాలను తరలిస్తోంది. భారీ స్థాయిలో నిర్మాణాలూ చేపడుతోంది. సరిహద్దుల్లో చైనా కదలికలు పెరుగుతుండటంతో భారత సైన్యం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డ్రాగన్ కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచుతోంది.
ఇదీ చూడండి:యుద్ధ సన్నద్ధతతో సైన్యం.. అశాంతి సృష్టిస్తే అంతే!
ఎల్ఏసీ నుంచి ఇప్పుడప్పుడే (కనీసం ఈ చలికాలం ముగిసేలోపు) బలగాలను వెనక్కి రప్పించే ఉద్దేశం చైనాకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆక్రమిత ఆక్సాయిచిన్ సహా సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో ఆయుధ నిల్వలను, సైనిక మోహరింపులను మరింత పెంచుకుంటుండటమే అందుకు నిదర్శనం. ఆక్సాయిచిన్లో ఎల్ఏసీకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో డ్రాగన్ తాజాగా మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాన్ని చేపట్టినట్లు భారత సైన్యం గుర్తించింది. నాలుగు ఫుట్బాల్ మైదానాలకు సమాన విస్తీర్ణాన్ని కలిగి ఉండే ఆ నిర్మాణాన్ని బలగాలు, శతఘ్నులు, రాకెట్ రెజిమెంట్లను ఉంచేందుకు చైనా ఉపయోగించుకునే అవకాశముందని విశ్రాంత సైన్యాధ్యక్షుడొకరు తెలిపారు. సాధారణంగా ఎత్తయిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేటప్పుడు సైనికులు అక్యూట్ మౌంటేన్ సిక్నెస్ వంటి అనారోగ్యం బారిన పడుతుంటారని, వారికి చికిత్స అందించే కేంద్రంగా ఆ నిర్మాణాన్ని వినియోగించుకునే అవకాశాలూ ఉన్నాయని పేర్కొన్నారు.
అరుణాచల్ సరిహద్దుల్లోనూ..
ఎల్ఏసీకి 82 కిలోమీటర్ల దూరంలో షింజియాంగ్లోనూ చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఆ ప్రావిన్సులోని హోటన్, కాంక్సివర్ మధ్య కొత్త రోడ్డును నిర్మిస్తోంది. ఆక్సాయిచిన్కు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రహదారిగా అది ఉపయోగపడనుంది. హోటన్ వైమానిక స్థావరంలో యుద్ధ విమానాలను డ్రాగన్ భారీగా సమకూర్చుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ చైనా కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అక్కడ తమ కదలికలను ప్రత్యర్థులు ఉపగ్రహాల సహాయంతోనూ గుర్తించకుండా ఉండేందుకుగాను కౌంటర్ స్పేస్ జామర్లను చైనా బలగాలు వినియోగిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థ 'ఎస్-400'ను అరుణాచల్ సమీపంలో ఇప్పటికే మోహరించినట్లు సమాచారం.