49 దేశాలు.. 456 కోట్లకుపైగా జనాభా... 66.44 ట్రిలియన్ డాలర్ల జీడీపీ... ఇవీ ప్రస్తుతం ఆసియా ఖండం గణాంకాలు.
140 కోట్లకుపైగా జనాభా... ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానం... ఆసియాలో మొదటిస్థానం... ఇవీ చైనా గణాంకాలు.
జనాభా, సైనిక శక్తి, ఆర్థికం ఇలా ఏ రంగంలో చూసుకున్నా ఆసియాలో చైనాదే అగ్రస్థానం. అయినా ఏం లాభం! పాకిస్థాన్, ఉత్తర కొరియా మినహా ఆసియాలోని ఏ దేశంతోనూ చైనాకు సత్సంబంధాలు లేవు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. అందుకేనేమో.. చైనాతో ఏ దేశమూ సఖ్యంగా వ్యవహరించదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది చైనా పాలకుల దురుసుతనం. ఇతర దేశాల్లో అంతర్భాగమైన పలు ప్రాంతాలను అక్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకునే దౌర్జన్యం, దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం దురాక్రమాలకు పాల్పడటం, దీనికి తోడు సరిహద్దులో విచక్షణా రహితంగా వ్యవహరించడం లాంటి అనేక కారణాలతో ఆసియాలోని దాదాపు అన్ని దేశాలకూ చైనా విరోధిగా మారింది.
అసలు చైనా ఎందుకిలా చేస్తోంది? సరిహద్దు దేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మానేసి కయ్యానికెందుకు కాలుదువ్వుతోంది? ఆసియా ఖండంలో ఎన్నో దేశాలున్నా చైనాకు భారత్పైనే ఎందుకంత కసి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు పరిశీలిస్తే..
భారత్పైనే ఎందుకు?
చైనా ప్రస్తుత జీడీపీ 13.61 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు. భారత్ది 2.65లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు. గత కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంవైపు దూసుకెళ్తున్న భారత్.. ఆసియాలోని దాదాపు అన్ని దేశాలకూ మిత్రదేశమే. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. చైనాను అధిగమించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ అవతరించగల శక్తి ఆసియాలో ఒక్క భారత్కు మాత్రమే ఉంది. అందుకే ప్రాంతీయంగా తమ పట్టును కోల్పోకూడదని, భారత్ను నిలువరించేందుకు అన్ని విధాలా అడ్డుకోవాలని కక్ష గట్టింది చైనా. ఇందుకోసం ఎన్నో కుయుక్తులకూ పాల్పడింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు చోటు దక్కకుండా అడ్డుపుల్ల వేసింది. చైనా-పాకిస్థాన్ కారిడార్ను రూపొందించి భారత్ను ఇరకాటంలో పెట్టాలని చూసింది. అయినప్పటికీ భారత్.. చైనాకు తలొగ్గకపోయే సరికి ఇక సరిహద్దు రగడకు తెరతీసింది. 2017లో డోక్లాం వివాదంతో మొదలుపెట్టి తాజా గాల్వన్ లోయ ఘర్షణ వరకూ తెచ్చింది. ఇందుకోసం నేపాల్నూ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.
భారత్-చైనా సరిహద్దు వివాదాలివే..
చైనా-భారత్ మధ్య ఎన్నో అంశాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పటికీ.. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ గురించే వివాదం నడుస్తోంది. ప్రస్తుతం భారత్లో అంతర్భాగమైన 83,743 చదరపు కిలోమీటర్ల భూభాగమున్న అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. అంతేకాదు ఆ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్గానూ పరిగణిస్తోంది. ఒకవేళ పూర్తి రాష్ట్రాన్ని తమకు ఇచ్చేందుకు భారత్ సుముఖంగా లేకపోతే కనీసం తవాంగ్ ప్రాంతాన్నైనా తమకు తిరిగిచ్చేయాలని బీజింగ్ పాలకులు డిమాండ్ చేస్తున్నారు.
జమ్ముకశ్మీర్లో అంతర్భాగమైన అక్సాయిచిన్లో 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా ఆక్రమించింది చైనా. దీనికి తోడు 1963 సినో-పాక్ ఒప్పందం ప్రకారం.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5,180 కిలోమీటర్ల భూమి ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉంది.
రష్యా
సైనికపరంగా అత్యంత శక్తిమంతమైన దేశంగా పేరున్న రష్యాతోనూ కయ్యానికి సై అంది చైనా. మంగోలియాలోని జెన్బావో దీవుల కోసం సోవియెట్ రష్యాతో యుద్ధం కూడా చేసింది. రెండు వారాలపాటు జరిగిన ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకుని జెన్బావో దీవులను సాధించుకుంది చైనా.
ఆ తర్వాత 1991లో సినో-సోవియెట్ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎలాంటి అణ్వాయుధ దాడికి పాల్పడకూడదని ఇరుదేశాలు అంగీకరించాయి.
నేపాల్
నేపాల్లోని పలు ప్రాంతాలు తమకే చెందుతాయన్నది చైనా వాదన. ఇరుదేశాల మధ్య 1956, 1960లో కుదిరిన ఒప్పందాల ప్రకారం వివాదంలోని కాలాపానీ లాంటి ప్రాంతాలు టిబెట్కు చెందినవని.. అందుకే అవి తమ అధీనంలోకి వస్తాయని చైనా వాదిస్తోంది.