తెలంగాణ

telangana

By

Published : Dec 7, 2020, 7:48 AM IST

ETV Bharat / international

చొచ్చుకొస్తున్న చైనా- సరిహద్దుల్లో గ్రామాలు నిర్మాణం!

సామ్రాజ్య కాంక్షతో ఉవ్విళ్లురుతున్న చైనా... భారత్​ సరిహద్దుకు సమీపంలో నూతన గ్రామాల ఏర్పాటు చేస్తుంది. అరుణాచల్​ ప్రదేశ్​ తమ భూభాగమేనన్న వాదనలకు బలం చేకూర్చేలా ఇవి ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీంతో భారత్​లోకి చొరబాట్లు పెంచేందుకు చైనా యత్నించవచ్చని చెబుతున్నారు.

China constructed new village at India border strengthen
చొచ్చుకొస్తున్న చైనా- సరిహద్దుల్లో గ్రామాలు నిర్మాణం!

అరుణాచల్​ ప్రదేశ్​ తమ భూభాగమేనన్న వాదనలకు బలం చేకూర్చుకునే దిశగా చైనా కుయుక్తులు పన్నుతోంది. భారత్​ సరిహద్దుకు సమీపంలో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నవంబరు మధ్య అక్కడ కనీసం మూడు ఊర్లు వెలిసినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాలు తాజాగా నిర్ధరించాయి. భారత్​లోకి చొరబాటుదారులను పంపించేందుకూ ఈ గ్రామాలను డ్రాగన్​ ఉపయోగించుకునే అవకాశముంది.

పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్​లో భారత్​, చైనా, భూటాన్​ సరిహద్దులు కలిసే చోటుకు సమీపంలో బుమ్​ లా పాస్ ఉంది. అక్కడికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో మూడు గ్రామాలను నిర్మించింది. వాటి మధ్య పరస్పర దూరంలో ఒకే ఒక్క కిలోమీటర్లు. గ్రామాలన్నింటినీ తారు రోడ్డుతో అనుసంధానించారు. ఒక్కో ఊర్లో కనీసం 50 నిర్మాణాలున్నాయి. కొండ ప్రాంతాల్లో చెక్కలతో నిర్మించే ఇళ్లలా అవి కనిపిస్తున్నాయి. వాటికి విద్యుత్తు, నీరు, అంతర్జాలం వంటి అన్ని సౌకర్యాలున్నాయి. ఆ గ్రామాల్లో ఉండేవారి పని సరిహద్దుల్లో గస్తీ కాయడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సరిహద్దుల్లో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్న కోనా ప్రాంతానికి (షన్నన్​ కౌంటీ)960 కుటుంబాలకు చెందిన 3,222 మందిని తరలించాలని చైనా భావిస్తోంది. డోక్లాంలో భారత్​ బలగాలతో 2017లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో.. భూటాన్​ భూభాగంలో గ్రామాలను చైనా నిర్మిస్తున్నట్లు ఇటీవల ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో కనిపించడం కలకలం సృష్టించింది.

దక్షిణ చైనా సముద్రంలోనూ ఇలాగే..

​"సరిహద్దు వివాదం విషయంలో తమ వాదనను బలోపేతం చేసుకునేందుకు, భారత్​లోకి చొరబాట్లను పెంచేందుకు డ్రాగన్​ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే హన్​ చైనీస్​ వర్గం ప్రజలను, టిబెట్​లోని కమ్యూనిస్టు పార్టీ సభ్యులను భారత సరిహద్దుల్లో ఉంచే వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమకు హక్కుందని చెప్పుకొనేందుకు గతంలో అక్కడ జాలర్లను మెహరించింది. అదే తరహాలో.. భారత బలగాలు గస్తీ నిర్వహించే హిమాలయ ప్రాంతాల్లో చొరబాట్లను పెంచేందుకు పశువుల కాపరుల వంటివారిని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి" అని చైనా వ్యవహారాల పరిశీలకుడు బ్రహ్మ చెల్లానీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ప్రపంచంలోనే అత్యంత సృజనాత్మక నగరం ఇది!

ABOUT THE AUTHOR

...view details