కరోనా వికృత రూపం- 88 లక్షల మందికి వైరస్ - brazil corona news
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 88 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 4లక్షల 63వేలు దాటింది. పాకిస్థాన్లో రికార్డు స్థాయిలో ఒక్క రోజే 153 మంది వైరస్కు బలయ్యారు.
కరోనా మహమ్మారి ఉగ్రరూపానికి ప్రపంచం విలవిలలాడుతోంది. మొత్తం కేసుల సంఖ్య 87లక్షల 95వేల 32కు చేరింది. మృతుల సంఖ్య 4లక్షల 63వేల 260కి పెరిగింది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా బ్రెజిల్లో బాధితుల సంఖ్య 10 లక్షల 38వేల 568కి చేరినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు సుమారు 50వేల మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మాత్రం కరోనా ముప్పుపై ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సామాజిక చర్యలు చేపడితే వైరస్ ప్రభావం కంటే ఆర్థిక వ్యవస్థపై ప్రభావమే దారుణంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే కరోనా గణాంకాలు 7 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పాకిస్థాన్లో రికార్డు..
పాకిస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో 24 గంటల్లో 153 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. 6వేల 606 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య లక్షా 71వేలు దాటింది. ఇప్పటి వరకు 3,382 మంది వైరస్ బారినపడి మరణించారు. 65వేల 163మంది కోలుకున్నారు.
సింగపూర్లో 218 కొత్త కేసులు
రెండు నెలల అనంతరం షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తెరిచిన మరునాడే సింగపూర్లో కొత్తగా 218 కేసులు నమోదయ్యాయి. వీరిలో విదేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 41వేల 833కు చేరింది. ఇప్పటివరకు 26మంది ప్రాణాలు కోల్పోయారు. 33వేల 500మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు.