తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస వేదికగా పాక్​ను ఎండగట్టిన భారత్​

జమ్ముకశ్మీర్​ విషయంలో ఏ దేశ జోక్యాన్ని సహించబోమని ఐరాస వేదికగా భారత్​ తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై పాక్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది భారత్. పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే ఆ దేశంపై విమర్శలు గుప్పించారు భారత విదేశాంగ శాఖ (తూర్పు) కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్. ఆరోపణలు చేస్తున్నవారే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.

By

Published : Sep 11, 2019, 7:17 AM IST

Updated : Sep 30, 2019, 4:49 AM IST

ఐరాస వేదికగా పాక్​ను ఎండగట్టిన భారత్​

జమ్ముకశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించిన పాకిస్థాన్​కు.... గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, నిర్బంధకాండ అమలు చేస్తున్నారని పాకిస్థాన్​ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. మంగళవారం మానవ హక్కుల మండలి (యూఎన్ హెచ్ఆర్​సీ) 42 వ సదస్సులో పాక్ అర్థంలేని మాటలను భారత్ తీవ్రంగా ఖండించింది.

ఉగ్రవాద దేశం నుంచి విమర్శలా?:భారత్

పాక్ చేసిన ఆరోపణలను ఎండగడుతూ ఆ దేశం పేరు ప్రస్తావించకుండానే విరుచుకుపడ్డారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ ఠాకూర్ సింగ్. ''మా దేశంపై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారు ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా ఉన్నారని, ఏళ్ల తరబడి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని'' అన్నారు.

ఐరాస వేదికగా పాక్​ను ఎండగట్టిన భారత్​

"దేశాలు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రాథమిక జీవనానికి విఘాతం కల్గిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమష్టిగా ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ఉగ్రవాద సంస్థలకు, వారిని ప్రోత్సహిస్తున్నవారి గురించి గళమెత్తాల్సిన అవసరముంది.

ఇక్కడున్న ఓ ప్రతినిధి బృందం నా దేశం గురించి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తోంది. వాక్చాతుర్యంతో కూడిన ఆ వ్యాఖ్యానాలు అంతర్జాతీయ తీవ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతం చేస్తోందని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉగ్రవాద సంస్థల కీలకనాయకులు ఏళ్ల తరబడి అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. దౌత్య వ్యూహాల్లో ఉగ్రవాదాన్ని ఒక విధానంగా ఆ దేశం ప్రోత్సహిస్తోంది."

-విజయ్ థాకూర్ సింగ్, విదేశీ వ్యవహారాలశాఖ (తూర్పు) కార్యదర్శి

దర్యాప్తు అవసరమే: పాక్

కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస మానవహక్కుల మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దర్యాప్తు చేపట్టాలని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చెయ్యడం అక్రమమని, కశ్మీర్​లో ప్రజలకు ప్రాథమిక హక్కులనూ నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనేనని పేర్కొన్నారు.

'రాజ్యాంగానికి లోబడే'

జమ్ముకశ్మీర్​కు సంబంధించి మా పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చల తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు ఠాకూర్ సింగ్.. కశ్మీర్ మా అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించబోమని పేర్కొన్నారు.

"మా పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలు అనేక చర్చల అనంతరం తీసుకున్నవి. ఆ నిర్ణయాలకు అన్ని పక్షాలనుంచి మద్దతు లభించింది. అవన్నీ దేశ సార్వభౌమ నిర్ణయాలు. పూర్తిగా భారత అంతర్గతం. ఇందులో ఏ దేశానికి జోక్యం చేసుకునే అధికారం లేదు."

-విజయ్ థాకూర్ సింగ్, విదేశీ వ్యవహారాలశాఖ (తూర్పు) కార్యదర్శి

ఇదీ చూడండి:ఆంధ్రప్రదేశ్​కు అతిపెద్ద... తెలంగాణకు అతిచిన్న!

Last Updated : Sep 30, 2019, 4:49 AM IST

ABOUT THE AUTHOR

...view details