AUSTRALIA DRONE PLANTING: గ్లోబల్ వార్మింగ్.. ఇప్పుడు మానవాళి మనుగడకు అతి పెద్ద సవాలుగా మారింది. భూతాపం రోజురోజుకు పెరుగుతూ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. దీనికి చెక్ పెట్టాలంటే.. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తగ్గించాలి. అది చెట్లతోనే సాధ్యం. అన్ని ప్రదేశాలకు వెళ్లి పెద్ద ఎత్తున చెట్లు నాటడం చాలా కష్టమైన పని.
అందుకోసమే.. ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్సీడ్ బయోటెక్ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన డ్రోన్ల ద్వారా చెట్లను నాటుతోంది. రెండేళ్లలో 10 కోట్ల చెట్లను నాటాలని నిర్ణయించింది. ఈ పద్ధతిన ఒకే రోజు వేర్వేరు ప్రదేశాల్లో మొత్తం 40 వేల విత్తన బంతులను విసరొచ్చు. స్వల్పకాలంలోనే అవి మొక్కలుగా మారుతాయి.
"గత ముప్పై సంవత్సరాలుగా గ్లోబల్వార్మింగ్పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల వాతావరణంలో ఉద్గారాల శాతం బాగా పెరిగిపోయింది. నిరవధికంగా అపారమైన అడవులను పెంచాలి. అప్పుడు కాస్త వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల శాతం తగ్గుతుంది."
- ఆండీ పిట్మ్యాన్, ప్రముఖ ప్రొఫెసర్
ఎయిర్సీడ్ కంపెనీ శాస్త్రవేత్తలు శరవేగంగా చెట్లను నాటడానికి కృషి చేస్తున్నారు. కొత్త డ్రోన్లను తయారుచేస్తూ.. కొన్ని సెకన్ల సమయంలో మొక్కలను నాటే విధంగా కొత్త పాడ్లను రూపొందిస్తున్నారు. మొదట డ్రోన్లతో నాటడానికి అనువైన ప్రదేశాలను మ్యాప్ చేస్తున్నారు. అనంతరం అక్కడ మట్టి శాంపిల్స్ను తీసుకొని ల్యాబ్లో పరీక్షిస్తారు. అక్కడి వాతావరణానికి అనుకూలమైన పాడ్లను రూపొందించి డ్రోన్ల ద్వారా నాటుతారు.
"డ్రోన్లను ఉపయోగించడం వల్ల అనేక లాభాలున్నాయి. ఒక వ్యక్తి రోజులో 800 చెట్లు నాటగలిగితే.. డ్రోన్ 40,000 విత్తన పాడ్లను నాటుతోంది. ముఖ్యంగా అవి ప్రజలకు హానికలిగించని ప్రదేశాల్లో నాటగలవు. కష్టతరమైన ప్రదేశాల్లో సైతం ఇలా మొక్కలను పెంచొచ్చు. మేము అన్ని రకాల మొక్కలను నాటుతున్నాం. వాతావరణం నుంచి కార్బన్ స్థాయిని తగ్గించడంతో పాటు వన్యప్రాణులకు నివాసాన్ని కల్పిస్తున్నాం."
-అండ్రూ వాకర్, కంపెనీ సీఈఓ