తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ గగన విషాదం: 97కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్​ విమాన ప్రమాదం ఘటనలో ఇప్పటివరకు 97 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. మొత్తం 99 మందితో లాహోర్​ నుంచి కరాచీ బయలుదేరిన పీకే-8303 విమానం.. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందు విమానాశ్రయానికి సమీపంలోని జిన్నా హౌసింగ్‌ సొసైటీపై కూలి పోయింది. అయితే మృతదేహాలు ప్రయాణికులవా? లేక ఇళ్లల్లోని వారుకూడా ఉన్నారా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

By

Published : May 23, 2020, 7:19 AM IST

Updated : May 23, 2020, 10:08 AM IST

At least 82 dead as Pakistan plane crashes in residential area in Karachi
పాక్​ విమాన ప్రమాదంలో 82మృతదాహులు వెలికితీత

పాకిస్థాన్​ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు పెరిగింది. సహాయక చర్యల్లో మరికొన్ని మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను జిన్నా పోస్ట్​ గ్రాడ్యుయేట్​ మెడికల్​ సెంటర్​లో, కరాచీ ఆసుపత్రిలో ఉంచినట్లు పాకిస్థాన్​ ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. అయితే వీరంతా విమాన ప్రయాణికులేనా? దెబ్బతిన్న ఇళ్లలోనివారు కూడా ఉన్నారా అన్నది ఇంకా స్పష్టంకాలేదు. పాక్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ ప్రెసిడెంట్‌ జాఫర్‌ మసూద్‌ మరొక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు.

ఘోర ప్రమాదం...

ప్రయాణం ఇలా

లాహోర్‌ నుంచి బయలుదేరిన పీకే-8303 అనే ఈ విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందు విమానాశ్రయానికి సమీపంలోని జిన్నా హౌసింగ్‌ సొసైటీపై కూలి పోయింది. ఇది ఎయిర్‌బస్‌ ఎ320 శ్రేణికి చెందిన విమానం. ఇందులో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. విమాన చక్రాల వ్యవస్థ (ల్యాండింగ్‌ గేర్‌)కు సంబంధించి సమస్యలు ఉన్నట్లు పీకే-8303 పైలట్‌ కెప్టెన్‌ సజ్జాద్‌ గుల్‌ మధ్యాహ్నం 2.37 గంటలకు విమాన రద్దీ నియంత్రణ వ్యవస్థ (ఏటీసీ)కు తెలిపినట్లు పీఐఏ అధికారి ఒకరు చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ లోహ విహంగం.. రాడార్‌ తెరపై నుంచి అదృశ్యమైందన్నారు.

ఈ దుర్ఘటన వల్ల కనీసం 25 ఇళ్లు, అనేక కార్లు దెబ్బతిన్నాయి. ఘటనా స్థలంలో దట్టంగా పొగ వ్యాపించింది. విమాన శకలాలతో అక్కడి వీధులు నిండిపోయాయి. కూలిపోవడానికి ముందు ఈ విమానం ఒక మొబైల్‌ టవర్‌ను ఢీ కొట్టిందని, రెక్కల భాగం నుంచి మంటలు వచ్చిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దెబ్బతిన్న ఇళ్లలో దాదాపు 25-30 మంది గాయపడ్డారు. విమాన ప్రయాణికుల్లో 31 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. విమాన ప్రమాదానికి నిర్దిష్ట కారణాలు తేలలేదని పీఐఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అర్షద్‌ మాలిక్‌ తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పైలట్‌.. ఏటీసీకి చెప్పారని వివరించారు.

దయనీయం...

గమ్యస్థానం వచ్చేసింది.. మరికొద్దిసేపట్లో కిందికి దిగేందుకు ప్రయాణికులందరూ ఉద్యుక్తులవుతున్నారు. అంతలోనే పెను విషాదం...రెక్కలు తెగిన పక్షిలా విమానం జనావాసాలపై కూలింది. దట్టమైన పొగలు...చెల్లా చెదురైన శకలాలతో ఆ ప్రాంతమంతా మరుభూమిలా మారిపోయింది. ఆర్తనాదాలు.. అరుపులు.. కేకలు మిన్నంటాయి. కరాచీలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిన్న మధ్యాహ్నం దృశ్యమిది.

మృత్యుంజయులు...

ఇద్దరు ప్రయాణికులు తప్పించుకొని బయటపడ్డారని విమానయాన అధికారులు తెలిపారు. వీరిలో బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ ప్రెసిడెంట్‌ జాఫర్‌ మసూద్‌ కూడా ఉన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ తర్వాత గత శనివారం నుంచి పాక్‌ తన విమాన సర్వీసులను పునఃప్రారంభించింది. పరిమిత సంఖ్యలో దేశీయ సర్వీసులను ప్రారంభించింది.

మేడే... మేడే... మేడే...

మరోవైపు పైలట్‌కు కరాచీ ఏటీసీకి మధ్య జరిగిన చిట్టచివరి సంభాషణను సంపాదించినట్లు పాక్‌ వార్తా ఛానల్‌ ఒకటి పేర్కొంది. దీని ప్రకారం.. విమానంలోని రెండు ఇంజిన్లు విఫలమైనట్లు పైలట్‌ తెలిపారు. ఆ తర్వాత కొద్ది సెకన్లకు పైలట్‌ 'మేడే.. మేడే.. మేడే..' (ప్రమాద సంకేతం) అని అరిచారు. అనంతరం విమానం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు.

Last Updated : May 23, 2020, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details