తూర్పు ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కార్చిచ్చు చెలరేగింది. మంటల్లో వందకు పైగా ఇళ్లు దగ్ధమయ్యయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.ముప్పై మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. న్యూ సౌత్వేల్స్, క్వీన్స్లాండ్ ప్రాంతాల్లో వందకు పైగా కార్చిచ్చులు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఎనిమిది ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నాయని తెలిపారు.
ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు.. వందల ఇళ్లు దగ్ధం
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు చెలరేగింది. దావానలం కారణంగా క్వీన్స్లాండ్, న్యూసౌత్వేల్స్ ప్రాంతంలో వందకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇద్దరు మరణించగా.. ముప్పై మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. 1500 అగ్ని మాపక బృందాలు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి.
1500 అగ్నిమాపక బృందాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితో పాటు విమానాలను మంటలార్పేందుకు ఉపయోగిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా చాలా ప్రాంతాల్లో ప్రజలు మంటలు ఏర్పాటు చేసే కార్యక్రమాలపై నిషేధం విధించారు. మంటల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. క్వీన్స్లాండ్ ప్రాంతంలో ఐదు వందల కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు.
అగ్నిప్రమాదాల విషయమై కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ట్రోగ్రతలు, బలంగా వీస్తున్న గాలులతో దావానలం మరింత విజృంభిస్తోంది. కరవు, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటం వంటి పరిస్థితులు అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. మంటల ద్వారా ఏర్పడిన మబ్బులు నగరాలను కమ్మేస్తున్నాయి.