వివాదాస్పద నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం కొన్ని రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి ఆర్మేనియా, అజర్బైజాన్లు. క్షిపణుల దాడులు, బాంబుల మోతలతో ఎంతోమంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో నివాస ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసుకోకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చాయి ఇరు దేశాలు.
జెనీవాలో ఆర్మేనియా, అజర్బైజాన్ల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఐరోపాలోని ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.కాల్పుల విరమణపైనా ఇరు దేశాలు సానుకూలంగా స్పందించినట్లు ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఓ ప్రకటన జారీ చేసింది.