తెలంగాణ

telangana

By

Published : May 20, 2020, 6:48 AM IST

ETV Bharat / international

కరోనా కాలం: చుక్కతో కిక్కే కాదు చిక్కు కూడా..!

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనాతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఆ దిగులును తగ్గించుకోవడానికి మందుబాబులు మరింత ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఆ మందు చుక్కే ఇప్పుడు వారికి కరోనా చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఓ మోస్తరుగా తాగడమూ కొవిడ్‌ వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

ALCOHOL CONSUMPTION IS INJURIOUS TO HEALTH DURING COVID SITUATION
కరోనా దిగులుతో చుక్క తాగితే.. చిక్కు వచ్చి వాలుతుంది!

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావాలతో ప్రపంచం మొత్తం అనిశ్చిత స్థితిలో ఉంది. ఆందోళనకు లోనవుతోంది. సాధారణంగా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఆశ్రయిస్తుంటారు. ఈ కోవలో మద్యాన్ని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువే. కరోనా ముప్పును మద్యం మరింత పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలకు స్వాగతం పలుకుతుందని పరిశోధకులు వెల్లడించారు.

రోగ నిరోధక శక్తిపై దుష్ప్రభావం

వ్యాధి ప్రభావాన్ని తీవ్రం చేయడానికి మద్యపానం దోహదపడుతుందని ఇటలీ పరిశోధకులు వెల్లడించారు. "శ్వాసకోశ వ్యవస్థలో వైరల్‌ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఎక్కువయ్యే ప్రమాదాన్ని మద్యపానం పెంచుతుంది. మద్యం వ్యసనపరుల్లో ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. వారికి వెంటిలేటర్ల ద్వారా శ్వాస అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది" అని ఇటలీకి చెందిన పరిశోధకుడు గియన్ని టెస్టినో చెబుతున్నారు. మద్యం తాగే వారిలో ఏసీఈ-2 ప్రొటీన్‌ స్థాయులు పెరగవచ్చని గియన్ని బృందం తాజాగా గుర్తించింది. ఈ పరిశోధన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. కరోనా వైరస్‌ మానవ కణాల్లోకి ప్రవేశించేందుకు ఏసీఈ-2 దోహదపడుతుందనే విషయం తెలిసిందే.

మెదడుపై ప్రభావం ఇలా..

ఆల్కహాల్‌ మెదడులోని కొన్ని నాడీ ప్రసారాలపై ప్రభావం చూపుతుంది. మెదడులో గమ్మా అమినోబుటిరిక్‌ యాసిడ్‌(గాబా) అనేది నాడీ ప్రసారాలను నిరోధించడం లేదంటే తగ్గించడం చేస్తుంది. గాబా ఉత్పత్తిని మద్యం పెంచుతుంది. అది నాడీ కణాల చర్యలను తగ్గిస్తుంది. అలానే నాడీ కణాల చర్యల్ని పెంచే గ్లుటమేట్‌ ఉత్పత్తిని మద్యం ప్రభావితం చేస్తుంది. అంటే ఎవరైనా తాగినప్పుడు మోతాదును బట్టి వారి శరీరం, మెదడు నెమ్మదిస్తాయి. భ్రాంతి, సమన్వయం తప్పడం జరుగుతుంది. అంటే మద్యపానం ఒత్తిడి తగ్గించడానికి బదులు మరింత పెంచుతుంది. ఈ అలవాటు కొనసాగితే మెదడులోని ప్రోత్సాహక కేంద్రంపై ప్రభావం చూపుతుంది. డోపమైన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మరింత మద్యం కావాలని కోరుతుంది. అంటే ఇంకా మందు తాగేలా చేస్తుంది. "ప్రజలు వారి ఒత్తిడి తగ్గించుకోవడానికి తరచుగా మద్యం తాగుతారు. కానీ కొంతకాలానికి ఇది వారిలో ఒత్తిడి తగ్గించకపోగా.. మరింత పెంచుతుంది" అని సిడ్నీలోని న్యూ సౌత్‌వేల్స్‌ యూనివర్సిటీ పరిశోధకుడు మైఖేల్‌ ఫెర్రెల్‌ తెలిపారు. 'ఒత్తిడి.. తాగడానికి దారితీస్తే.. తాగడం ఒత్తిడికి దారితీస్తుంది' అని చెబుతున్నారు.

విదేశాల్లో లాక్‌డౌన్‌ సమయంలో పెరిగిన అమ్మకాలు

లాక్‌డౌన్‌ సమయంలో అమెరికా, బ్రిటన్‌ సహా అనేక దేశాల్లో మద్యం విక్రయాలు బాగా పెరిగాయి. అమెరికాలో గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ మార్చిలో 55%, బ్రిటన్‌లో 22% విక్రయాలు పెరిగాయి. దక్షిణాఫ్రికా, భారత్‌, శ్రీలంక, గ్రీన్‌లాండ్‌ దేశాల్లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలను బంద్‌ చేసినా, వినియోగం తగ్గలేదని నివేదికలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మన దేశంలో నిషేధం ఉండడంతో మొదట్లో విలవిల్లాడిన మద్యం ప్రియులు- ఇటీవల గేట్లు ఎత్తేయడంతో తెగ తాగేస్తున్నారు.

క్షణ భంగురమే..

నిషాతో ఆ నిమిషం హాయిగా అనిపించినట్లు ఉంటుంది. రక్తంలోని ఆల్కహాల్‌ స్థాయి పెరుగుతుంది. మెదడు విశ్రాంతి పొందుతున్నట్లు, కొంత భ్రాంతి, ఉల్లాస స్థితి కలుగుతుంది. అదంతా కాసేపే. 20-30 నిమిషాల తర్వాత శరీరం ఆల్కహాల్‌ని బయటికి పంపించడం ప్రారంభిస్తుంది. అలా రక్తం నుంచి ఆల్కహాల్‌ బయటికి వెళ్లగానే అసౌకర్యం మొదలవుతుంది. తాగక ముందు ఉన్న ఒత్తిడి కంటే.. నిషా తగ్గిన తర్వాత ఇంకా ఎక్కువవుతుంది.

అతి అలవాటుకు కారణాలు..

  • కరోనా నేపథ్యంలో తలెత్తిన ఒత్తిడిని తగ్గించుకోవడానికి
  • ఇంటి దగ్గరే ఉంటుండడంతో కాలక్షేపానికి..
  • వ్యాపార నష్టాలు, ఉద్యోగ భయాల నుంచి కాసేపు బయటపడడానికి
  • కొన్ని రకాల వ్యక్తిగత కారణాలు..

అపోహలు.. వాస్తవాలు

అపోహ: మద్యం వైరస్‌ని నాశనం చేస్తుంది.

వాస్తవం: ఆల్కహాల్‌ శరీరంపైన మాత్రమే క్రిమినాశనిగా పనిచేస్తుంది. తాగితే లోపల అలా పనిచేయదు. పీల్చిన గాలిలో, నోటిలో, గొంతులో ఉన్న వైరస్‌ని చంపదు. కరోనా బారిన పడిన వారు మద్యం తాగితే.. అది ముప్పును మరింత పెంచుతుంది. అలానే తాగేవారు ఈ వైరస్‌ బారిన పడినా ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది.

అపోహ:ఆల్కహాల్‌ రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్‌ని అడ్డుకుంటుంది.

వాస్తవం: రోగ నిరోధక శక్తికి ఆల్కహాల్‌ విషం లాంటిది. అలానే వైరస్‌నీ నిరోధించలేదు.

కొంచెం తాగినా ముప్పే: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మద్యం వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల పలు హెచ్చరికలు జారీ చేసింది. ఆల్కహాల్‌తో స్వల్ప, దీర్ఘకాల ప్రభావాలు రెండూ ఉంటాయని, శరీరంలోని ప్రతి భాగంపై దీని ప్రభావం ఉంటుందని స్పష్టంచేసింది. మద్యంపై నెలకొన్న అపోహల్నీ నివృత్తి చేసింది.

  • మద్యం తాగడంలో 'సురక్షిత పరిమితి' అనేది లేదు. కొంచెం తాగినా ఆరోగ్యం దెబ్బతింటుంది. కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది.
  • అతిగా తాగితే శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఫలితంగా వ్యాధులను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత (ఎక్యూట్‌ రిస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌- ఏఆర్‌డీఎస్‌) ముప్పును పెంచుతుంది.
  • గృహహింస, మానసిక సమస్యలకు కారణమవుతుంది. క్వారంటైన్‌ నేపథ్యంలో చైనాలో మూడు రెట్లు, మలేసియా, లెబనాన్‌ దేశాల్లో రెట్టింపు సంఖ్యలో గృహహింస కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జపాన్‌, ఇటలీ తదితర దేశాల్లో గృహహింస సంబంధిత మరణాలు పెరిగాయని వెల్లడించింది.
  • ఒంటరిగా ఉండి తాగేవారిలో ఆత్మహత్య భావనలూ పెరుగుతాయి.

ఇదీ చదవండి:ట్రెండింగ్​ భారత్​: ట్రంప్​.. మోదీ.. ఓ వలస కూలీ

ABOUT THE AUTHOR

...view details