తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 8:48 AM IST

ETV Bharat / international

ఆయుష్షు పెంచే ఆరోగ్య సాధనం 'సైకిల్'

సైకిల్​... సామాన్యుల ప్రయాణంలో కీలక పాత్రధారి. ఒక సాధారణ, చౌకైన, సులభతర ప్రయాణ వాహనం. మొత్తంగా బహుళ ప్రయోజనకారి. పురాతన కాలంలో పనులను వేగవంతం, సులభతరం చేయడంలో దీని పాత్ర అమోఘం. క్రమక్రమంగా మరెన్ని సదుపాయాలు, సౌకర్యాలు సమకూరినా.. సైకిల్​ వాడకం నిత్యనూతనమే. దాని అవసరం, ప్రయోజనం ఇప్పటికీ ఉంది. కరోనా కాలంలో మరింత పెరిగింది. జూన్​ 3న ప్రపంచ సైకిల్​ దినోత్సవం(Bicycle Day) సందర్భంగా సైకిల్​ విశేషాలు మీకోసం...

world bicycle day
Bicycle Day: సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

జూన్​ 3న ప్రపంచ సైకిల్​ దినోత్సవాన్ని(Bicycle Day) జరుపుకుంటారని మీకు తెలుసా? మొట్టమొదటి సారిగా 2018 జూన్​ 3న న్యూయార్క్​లోని ఐరాస జనరల్​ అసెంబ్లీ వేదికగా ఐక్యరాజ్యసమితి ఈ సైకిల్​ డేని నిర్వహించింది.

ఎందుకు నిర్వహించాలి..?

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

సైకిల్ వాడకంతో కలిగే లాభాలపై ప్రచారం చేయడమే ఈ దినోత్స‌వం(Bicycle Day) ముఖ్య ఉద్దేశం. నడక, సైక్లింగ్​ సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నివేదించింది. సైకిల్​ వాడకంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్​ వచ్చే అవకాశాలు తక్కువ. మొత్తంగా ఆయుష్షు పెంచుకోవచ్చట.

ప్రాముఖ్యం, లక్ష్యాలు...

రహదారి భద్రతను మెరుగుపరచడానికి సభ్యదేశాలను ప్రోత్సహించ‌ట‌మే కాక‌, పాదచారుల భద్రతను కాపాడటానికి సైకిల్ వాడ‌కాన్ని ప్రోత్సహిస్తోంది ఐరాస. జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం, సైక్లింగ్​ సంస్కృతిని మరోస్థాయికి తీసుకెళ్లేలా కొత్త కొత్త విధానాలు, ఉత్తమ పద్ధతులతో ముందుకొచ్చేలా సభ్యదేశాల్ని ప్రోత్సహిస్తోంది.

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు
సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

సైకిల్​ వల్ల ప్రయోజనాలు...

సైకిల్​ తొక్కితే శారీరక ఉత్సాహంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మోటారు వాహనాలు వినియోగించిన వాళ్ల జీవిత కాలం.. 60-70 ఏళ్లు కాగా.. సైకిల్​ తొక్కేవారు 80-90 ఏళ్ల వరకు జీవించే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు
  • సైకిల్ సరళమైన, సరసమైన, నమ్మదగిన, పర్యావరణ అనుకూల రవాణా మార్గంగా చెప్పవచ్చు. సైకిల్.. అభివృద్ధికి ఒక సాధనంగా, విద్య, ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.
  • శారీరకంగా దృఢంగా ఉండేందుకు, వ్యాధుల బారి నుంచి రక్షణకు.. సైకిల్​ తొక్కడం మంచిదట.
  • సైకిల్... రవాణాకు ఉప‌యోగక‌ర‌మే కాకుండా, ఇంధన ఆదాకు ఉప‌యుక్త‌మైన‌ది.
  • ఇంధన వనరుల దిగుమతి తగ్గించుకొని.. ఆర్థిక భారం నుంచి విముక్తి పొందవచ్చు.
    సైకిల్​ వల్ల ప్రయోజనాలు...

కరోనా కాలంలో డిమాండ్​..

"వ్యక్తిగత వాహనాలు వద్దు- ప్రజా రవాణా ముద్దు"... కొన్ని నెలల క్రితం వరకు ప్రపంచవ్యాప్తంగా వినిపించిన నినాదమిది. కర్భన ఉద్గారాలు, కాలుష్యాన్ని తగ్గించి... భూగ్రహాన్ని కాపాడుకునేందుకు బస్సులు, మెట్రోల్లోనే ప్రయాణించాలని ప్రజల్ని ప్రోత్సహించాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. కానీ... ఇప్పుడు కథ మారింది. అందుకు కారణం... కరోనా.

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

ఉదయం ఆఫీస్​కు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు బస్సులు, మెట్రో రైళ్లు ఎంత కిక్కిరిసి ఉంటాయో మనకు తెలియనిది కాదు. సీటు కాదు కదా... నిల్చునే స్థలం దొరకడమే గొప్ప విషయం. కానీ... ఇప్పుడు అలా ప్రయాణించగలమా? లేనే లేదు. కరోనా కాలంలో అలా ఇరుకైన బస్సులో, మెట్రోలో వెళ్తే అంతే సంగతులు. అలా అని అందరూ వ్యక్తిగత వాహనాల్లో వెళ్దామా అంటే... మొదటికే మోసం వస్తుంది. కరోనా నుంచి తప్పించుకున్నా కాలుష్య భూతం కాటేస్తుంది.

మరి ఈ సంక్లిష్ట పరిస్థితిని అధిగమించడం ఎలా? ఈ ప్రశ్నకు ఇప్పటికే అనేక దేశాల్లో గట్టిగా వినిపిస్తున్న సమాధానం.... సైకిల్​. కరోనా రహిత, కాలుష్య రహిత, పర్యావరణ హిత ప్రయాణం సైకిల్​తోనే సాధ్యం మరి. అందుకే సైక్లింగ్​ను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాయి వేర్వేరు దేశాల ప్రభుత్వాలు. బ్రిటన్​ వంటి దేశాలు ఇప్పటికే కరోనా ప్యాకేజీలో భాగంగా కోట్లాది రూపాయలు ఇందుకోసం కేటాయించాయి.

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

ఏ దేశంలో ఎలా?

ఐరోపా దేశాల్లో మూడో వంతు ప్రజలు సైకిల్​నే ప్రధాన వాహనంగా వినియోగిస్తున్నారు. 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచిన్న పట్టణాలకు వెళ్లాలంటే కార్లు, బస్సులకు బదులు వీటికే ఓటేస్తున్నారు.

డెన్మార్క్​లో..

అత్యుత్తమ జీవన శైలి కలిగిన నగరంగా పేరుగాంచిన డెన్మార్క్ రాజధాని కోపెన్​హెగన్​కు సైక్లింగ్​లో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం ఉంది. పర్యావరణ అనుకూల నగరాల్లో ఒకటైన కోపెన్​హెగన్​లో... 2010 నుంచే 36 శాతం పౌరులు సైకిల్ ఉపయోగిస్తున్నారు. అక్కడి యంత్రాంగం చొరవతో.. 2017 నాటికి వాడకం 60శాతానికి పెరిగింది.

నెదర్లాండ్స్​లో...

నెదర్లాండ్స్​లో సైక్లింగ్​ అనేది సాధారణ జనజీవనంలో ఓ భాగం. అక్కడ రవాణాకు దాదాపు 36 శాతం మంది సైకిల్​నే ఎంచుకుంటారు. ప్రజా రవాణా(11 శాతం) వినియోగించడం చాలా తక్కువ. దేశంలో సైక్లింగ్​ మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తారు. సైక్లింగ్​కు అనువైన విధంగా మార్గాలు, పార్కింగ్​, కూడళ్లు, ట్రాక్​ల నిర్మాణాల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తారు. డచ్ ప్రధాని తరచూ సైకిల్​పైనే చక్కర్లు కొట్టడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది.

అదే దారిలో బ్రిటన్​...

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో చాలా దేశాలు దూరదృష్టితో ఆలోచిస్తున్నాయి. మున్ముందు ముప్పులను పసిగట్టి.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. బ్రిటన్​ కూడా.. రవాణా రంగంలో కీలక మార్పులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 'వన్స్​ ఇన్​ ఏ జనరేషన్​' పేరుతో.. సైక్లింగ్, నడక మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా గతేడాది 2 బిలియన్​ పౌండ్ల నిధుల్ని ప్రకటించింది.

భౌతిక దూరాన్ని పాటించేందుకు ప్రజా రవాణా చేటు అని గ్రహించి.. సైక్లింగ్​, నడకకు ప్రాధాన్యం ఇస్తోంది యూకే సర్కార్​. ఇది ఇంకా వ్యాపార వృద్ధి, ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు యూకే రవాణా కార్యదర్శి గ్రాంట్​ షేప్స్​. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మిలియన్ల కొద్ది సైకిళ్లు రోడ్లపైకి వచ్చే అవకాశముందని.. అందుకు అనుగుణంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారుల నిర్మాణం, అభివృద్ధి జరగాలని ఆదేశించారు.

అమెరికాలో పెరిగిన డిమాండ్​..

కొవిడ్​ విస్తృతి అధికంగా ఉన్న అమెరికాలోనూ సైకిళ్లకు డిమాండ్​ పెరిగిపోయింది. భౌతిక దూరం పాటించడం కోసం వీటి వెంటపడ్డారు అమెరికన్లు. సైకిల్​ స్టోర్లకు భారీగా తరలివెళ్తున్నారట.

భారత్​ కూడా ఆ దిశగా...

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

సైకిల్ వినియోగంలో ప్రస్తుతం భారత్... ఇతర దేశాల కంటే వెనుకంజలో ఉంది. ఆ దేశాల బాటలోనే మనమూ పయనిస్తే పర్యావరణానికి మేలు జరగడమే కాక దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మోటారు వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతుంది. ఫలితంగా.. ఇంధన వనరులను పరిమిత స్థాయిలో వాడుకోవచ్చు.

సామాన్యుడి రథం సైకిల్​కూ ఓ రోజు

సాధారణంగా.. ఏ వాహనంలోనైనా 100% ఇంధనం ఖర్చవదు. అందులో రెండో వంతు గాలిలో కలిసిపోతుంది. పర్యావరణ కాలుష్యం పెరగటానికి... ఇదే ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వల్ల దేశ ఖజానాపై సుమారు 50 బిలియన్ డాలర్ల భారం పడుతోంది. సైకిల్ వినియోగంతో ఇంధన వనరుల దిగుమతి తగ్గించుకుని ఆర్థిక భారం నుంచి విముక్తి పొందవచ్చు.

ABOUT THE AUTHOR

...view details