మంచు తుపాను అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎడతెరపి లేని హిమపాతానికి జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పరిమితంగా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. బయటకు వెళ్లడమే గగనం కాగా... చాలా చోట్ల రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మంచు తుపాను ప్రభావం గురువారం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే హోం శాఖకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. అయితే విద్యుత్ పునరుద్ధరణపై ఇంకా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. శీతల వాతావరణం కారణంగా సంస్థలు ఏ రకంగానూ విద్యుత్ను ఉత్పత్తి చేయలేకపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
"విద్యుత్ పునరుద్ధరణ త్వరగా జరుగుతుందని ఎవరూ ఆశించకండి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయే పరిస్థితి రాకూడదంటే అందరూ వీలైనంత వరకు విద్యుత్ వినియోగానికి దూరంగా ఉండండి."