డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ నెగ్గానని చెప్పుకుంటున్న అన్ని రాష్ట్రాల్లోనూ న్యాయపోరాటం చేయబోతున్నట్లు రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇందులో భాగంగా తాజాగా జో విజయాన్ని ఖరారు చేస్తుందనుకుంటున్న నెవాడాలో భారీ స్థాయిలో ఎన్నికల అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ రిపబ్లికన్లు గురువారం నాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్లలో కూడా ట్రంప్ శిబిరం న్యాయపోరాటానికి దిగింది. అయితే మిషిగన్, జార్జియాలో వేసిన వ్యాజ్యాలను న్యాయస్థానాలు తిరస్కరించాయి.
"బైడెన్ గెలిచారని చెప్పుకుంటున్న అన్నిచోట్లా ఓటర్లను మోసం చేసినందుకు, ఎన్నికల్లో మోసానికి పాల్పడినందుకు కేసులు వేయబోతున్నాం. మోసాలు చేశారనేందుకు బోలెడన్ని రుజువులున్నాయి. మీడియావారూ! చూసుకోండి.. మేం గెలవబోతున్నాం.. గెలవబోతున్నాం. అమెరికా ఫస్ట్.
న్యాయమైన ఓట్లను లెక్కిస్తే నేను గెలుస్తాను. చట్టవ్యతిరేక ఓట్లను లెక్కిస్తే.. మా గెలుపును వారు కొల్లగొట్టేస్తారు."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
"అధ్యక్ష ఎన్నికను నెవాడా నిర్ణయింస్తుందని మేం ముందు నుంచీ చెబుతూ వస్తున్నాం. ఇప్పుడు న్యాయస్థానం నుంచి అత్వసర ఉపశమనం కోరుతున్నాం. అన్యాయంగా నమోదైన ఓట్ల లెక్కింపును ఆపేయాలని న్యాయమూర్తిని అడుగుతున్నాం. డెమొక్రాట్లు ఇక్కడ ఎన్నికల పద్ధతిని పూర్తిగా మార్చేశారు. మెయిల్ ఇన్ బ్యాలెట్ల పేరిట ఒక్కో ఇంటికి ఇబ్బడిముబ్బడిగా బ్యాలెట్ పేపర్లు పంపించారు. ట్రక్కుల్లో తరలించారు. చాలామందిని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనీయలేదు. నెలరోజులు ఇక్కడ నివాసం ఉన్న వారికి ఓటింగ్ అర్హత ఇచ్చారు. అలా ఇతర ప్రాంతాల వారు వచ్చి ఓట్లు వేశారు. ఇప్పటిదాకా ఒక్క మెయిల్ ఇన్ బ్యాలెట్ను కూడా పరిశీలించనివ్వట్లేదు. వీటిలో బోలెడంత మోసం ఉంది."