తెలంగాణ

telangana

ETV Bharat / international

నెవాడా ఓట్ల లెక్కింపులో జాప్యానికి కారణమేంటి?

అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. నెవాడాలో కౌంటింగ్‌ మరీ నెమ్మదిగా సాగుతోంది. దాదాపు 87 శాతం ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు లెక్కించారు. మిగిలిన ఓట్ల కౌంటింగ్‌లో మరింత జాప్యం జరుగుతోంది.

By

Published : Nov 7, 2020, 12:43 PM IST

us elecion nevada
నెవాడా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ ఇంకా వీడడం లేదు. ఇంకా ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. నెవాడాలో కౌంటింగ్‌ మరీ నెమ్మదిగా సాగుతోంది. దాదాపు 87 శాతం ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు లెక్కించారు. మిగిలిన ఓట్ల కౌంటింగ్‌లో మరింత జాప్యం జరుగుతోంది. ఇది అక్కడ సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అసలు అక్కడ ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందో ఓసారి చూద్దాం..

జాప్యానికి మూలం..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఓటర్లందరికీ మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్లు పంపాలని రాష్ట్ర చట్టసభ తీర్మానించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత వారం రోజుల వరకు వచ్చే పోస్టల్‌ ఓట్లను స్వీకరించేందుకు అనుమతించింది. అయితే, అవి ఎన్నికల తేదీ లేదా అంతకంటే ముందు వేసినవి అయి ఉండాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అక్కడ పోస్టల్‌ ఓట్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద కౌంటీ అయిన వాషూలో గతంలో మునుపెన్నడూ లేని స్థాయిలో మెయిల్‌ ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల అధికారి డియన్నా స్పికులా తెలిపారు.

ఎక్కడి వరకు వచ్చింది..

ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ నెవాడాలో విజేతను ప్రకటించలేదు. శుక్రవారం సాయంత్రానికి 87 శాతం ఓట్లు లెక్కించారు. ముందు నుంచీ ఆధిక్యంలో ఉన్న బైడెన్‌ ప్రస్తుతం 22,657 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇంకా లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు లెక్కించని ఓట్లలో క్లార్క్‌ కౌంటీకి చెందినవే ఎక్కువని పేర్కొననారు. ఈ కౌంటీలో లాస్‌వెగాస్ నగరం‌ సహా జనాభా ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాలు ఉన్నాయి. లెక్కించని ఓట్లలో చాలా రకాలు ఉన్నాయని.. వాటిలో కొన్నింటినీ పలు అంచెల్లో తనిఖీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ప్రక్రియలో సంక్లిష్టత..

ఇంకా లెక్కించాల్సిన వాటిలో దాదాపు అన్నీ పోస్టల్‌ ద్వారా అందినవే. వీటిని పలు దశల్లో క్షుణ్నంగా తనిఖీ చేస్తారు. తొలుత బ్యాలెట్లపై ఉన్న సంతకాలను మెషీన్లతో ధ్రువీకరిస్తారు. అక్కడ తిరస్కరణకు గురైన వాటిని తిరిగి అధికారులు పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే కౌంటింగ్‌కు పంపుతారు. గురువారం నాటికి 44,000 బ్యాలెట్లకు ఐడీ వెరిఫికేషన్‌ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరో 2,100 ఓట్లకు సంతకం సరిపోలడం లేదన్న సమస్య తలెత్తిందని చెప్పారు. ఇప్పుడు వీటన్నింటినీ ఓటర్ల దగ్గరకు వెళ్లి ధ్రువీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇంతటి సంక్లిష్ట ప్రక్రియ వల్లే కౌంటింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఎప్పటికి పూర్తవుతుంది..

మిగిలి ఉన్న బ్యాలెట్లలో మెజార్టీ ఓట్లను ఆదివారానికి లెక్కిస్తామని ఎన్నికల అధికారి గ్లోరియా తెలిపారు. అయితే, పూర్తి ఓట్లను లెక్కించడానికి చట్టసభ చేసిన తీర్మానం ప్రకారం వారికి నవంబరు 12 వరకు గడువు ఉంది. అప్పటి వరకు సమస్యలన్నింటినీ పరిష్కరించి లెక్కింపులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూస్తామని వెల్లడించారు. మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్లను లెక్కించడంలోనే ఆలస్యం జరుగుతోందని.. కావాలని ఎక్కడా జాప్యం చేయడం లేదని చెప్పారు. ప్రతి ఓటును లెక్కించే వరకు ఎవరికీ ఎలాంటి సమాధానం ఇవ్వలేమన్నారు.

ఇదీ చూడండి:'విజయం మాదే.. 300 ఎలక్టోరల్​లు గెలుస్తాం'

ABOUT THE AUTHOR

...view details