ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ టీకాల(Covid Vaccine) వల్ల కొద్దిమందిలో తలెత్తుతున్న దుష్ప్రభావాలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే వ్యాక్సిన్ పొందాక ఒకటి రెండు రోజుల పాటు తలెత్తే లక్షణాలు.. రోగనిరోధక వ్యవస్థ క్రియాశీలం కావడానికి సంబంధించిన సంకేతాలేనని, ఇవి మామూలేనని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందాక ఒకరోజుపాటు శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేపట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాక్సినేషన్ తర్వాత ఏం జరుగుతుంది?
మన రోగ నిరోధక వ్యవస్థలో రెండు విభాగాలు ఉన్నాయి. ఇందులో మొదటిది.. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్ వంటివి చొరబడినప్పుడు వెంటనే గుర్తిస్తుంది. అనంతరం ఆ ప్రాంతాన్ని తెల్లరక్త కణాలు చుట్టుముడతాయి. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తలెత్తుతుంది. చలి, అలసట వంటి లక్షణాలు దీనివల్లే ఏర్పడుతుంటాయి. టీకా ఇచ్చాక ఇదే ప్రక్రియ జరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థలోని ఈ సత్వర స్పందన లక్షణం.. వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుంటుంది. అందువల్లే వృద్ధులతో పోలిస్తే యువతలోనే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని రకాల టీకాలతో ఈ స్పందన మరింత ఎక్కువగా ఉండొచ్చు.
అలాగే స్పందన విషయంలో వ్యక్తుల మధ్య కూడా వైరుధ్యం ఉంటుంది. కొందరిలో ఇలాంటి లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. దాన్నిబట్టి టీకా పనిచేయడంలేదన్న ఆపోహ చెందనవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరంలో ఈ మొదటి అంచె ప్రక్రియ జరుగుతుండగానే.. రోగనిరోధక వ్యవస్థలోని రెండో భాగం తన పని తాను చేసుకుపోతుంది. వైరస్ నుంచి అసలైన రక్షణ కల్పించేది ఈ వ్యవస్థే. అది వైరస్ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమైనప్పుడు కొన్ని సందర్భాల్లో అది తాత్కాలికంగా లింఫ్ నోడ్లలో వాపును కలిగించొచ్చు. అందువల్ల సాధారణ మామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలనుకుంటున్న మహిళలు.. కొవిడ్-19 టీకాకు ముందే వీటిని చేయించుకోవాలని నిపుణులు సూచించారు. లేకుంటే టీకా వల్ల నోడ్లలో వచ్చిన వాపును క్యాన్సర్గా పొరబడే అవకాశం ఉంటుందన్నారు.