తెలంగాణ

telangana

డబ్ల్యూహెచ్​ఓ అసెంబ్లీపై అమెరికా-చైనా ఉద్రిక్తతల ఎఫెక్ట్​!

By

Published : May 18, 2020, 11:59 AM IST

రెండు రోజుల డబ్ల్యూహెచ్​ఓ అసెంబ్లీ నేడు ప్రారంభం కానుంది. కరోనా వైరస్​పైనే చర్చ ఉండనుంది. వైరస్​పై పోరుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదింపజేయాలని పలు దేశాలు కృషిచేస్తున్నాయి. అయితే అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఈ అంతర్జాతీయ సమావేశంపై ప్రభావం చూపే అవకాశముంది.

WHO to kick off international meet amid US-China tensions
డబ్ల్యూహెచ్​ఓ అసెంబ్లీపై అమెరికా-చైనా ఉద్రిక్తతల ఎఫెక్ట్​!

కరోనా మహమ్మారిపై చర్చే ప్రధాన అజెండాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) అసెంబ్లీ నేడు ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రపంచ దేశాలు ఈ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొననున్నాయి. అయితే కరోనా వైరస్​పై అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. ఈ సమావేశంపై ప్రభావం చూపే అవకాశముందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డబ్ల్యూహెచ్​ఓ అసెంబ్లీ సహజంగా మూడు వారాలపాటు జరుగుతుంది. కానీ కరోనా సంక్షోభం వల్ల ఈసారి కేవలం రెండురోజులకే పరిమితమైంది. డబ్ల్యూహెచ్​ఓను స్థాపించిన నాటి(1948) నుంచి ఈ సమావేశమే అత్యంత ముఖ్యమైనదని అన్నారు సంస్థ సారథి​ ఆథనామ్​ టెడ్రోస్​.

తీర్మానం గట్టెక్కేనా?

వైరస్​పై పోరులో ప్రపంచ దేశాల సహకారానికి సంబంధించి ఐరోపా సమాఖ్య ఓ తీర్మానాన్ని ప్రతిపాదించింది. కరోనా సంక్షోభంలో అంతర్జాతీయంగా "నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర" స్పందన ఉండాలని అందులో పేర్కొంది. పరీక్షలు, వైద్య పరికరాలు, చికిత్స, భవిష్యత్తులో రూపొందించే వ్యాక్సిన్​లను సమానంగా వినియోగించుకోవాలని సూచించింది. ఆమోదం పొందినట్టయితే.. డబ్ల్యూహెచ్​ఓ చరిత్రలోనే ఎలాంటి వ్యతిరేకత లేకుండా గట్టెక్కిన తొలి తీర్మానంగా ఇది మిగిలిపోతుంది.

అయితే అమెరికా-చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయి. వైరస్​పై నిజాన్ని దాచడంలో చైనాకు డబ్ల్యూహెచ్​ఓ సహాయం చేసిందని ఇప్పటికే అమెరికా అనేకసార్లు ఆరోపించింది. సంస్థకు నిధులను కూడా నిలిపివేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వీటి ప్రభావం ఈ తీర్మానంపైనా పడే అవకాశముంది.

ఎన్ని క్లిష్ట పరిస్థితులు తలెత్తినా.. తీర్మానం గట్టెక్కాలని ఇతర దేశాలు ఆశిస్తున్నాయి. వైరస్​పై పోరుకు ఈ తీర్మానం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details