అమెరికా పాత్రికేయుడు డానియేల్ పెరల్ అపహరణ, హత్య కేసుల్లో నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పును ఖండిస్తూ గురువారం శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. సుప్రీం తీర్పు ఉగ్రవాద బాధితులను అవమానించేలా ఉందని అభిప్రాయపడింది. డానియేల్ కుటుంబం సైతం తీర్పుని తీవ్రంగా తప్పుబట్టింది. న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టింది.
2002లో డానియేల్ పెరల్ను అపహరించి హత్య చేసిన కేసులో అల్ఖైదా ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ ప్రధాన నిందితుడు. అతడితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపై అభియోగాల్ని కొట్టివేస్తూ పాక్ సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెలువరింది. ఈ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా.. పాక్ ప్రభుత్వం వెంటనే న్యాయసమీక్షకు ఉన్న మార్గాలను అన్వేషించాలని కోరింది. అలాగే ఈ కేసును విచారించేందుకు అమెరికాను అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.
ఖండించిన భారత్..
భారత్ సైతం పాక్ సుప్రీం తీర్పును తీవ్రంగా ఖండించింది. న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపింది. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ నిబద్ధతను ఈ తీర్పు తేటతెల్లం చేస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఒమర్ సయీద్ షేక్ను భారత్ 1999లో జైలు నుంచి విడుదల చేసింది. అప్పట్లో విమానాన్ని హైజాక్ చేసి భారత్పై ఒత్తిడి తేవడంతో.. అందులో సామాన్య ప్రయాణికుల ప్రాణాల్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. అందులో ఒకరే ఈ షేక్.
నేపథ్యం ఇది...
అమెరికా పౌరుడైన డనియేల్ పెరల్.. ప్రముఖ పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్కు పాత్రికేయుడిగా పనిచేసేవారు. విధుల్లో భాగంగా పాకిస్థాన్లో పనిచేసిన ఆయన.. ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ అల్ఖైదాకు మధ్య ఉన్న సంబంధాల్ని బయటకు తెచ్చేందుకు పరిశోధన ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న ఒమర్ సయీద్ షేక్ సహా మరో ఇద్దరు ముష్కరులు ఆయన్ని అపహరించారు. కొన్ని రోజుల తర్వాత తల నరికి ఘోరంగా హత్య చేశారు.
ఇదీ చదవండి:అఫ్గాన్లో పాక్ ఉగ్రసంస్థ అధినేత హతం!