అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దక్షిణాసియాలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లకు వెళ్లాలనుకునే తమ పౌరులకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. పాక్కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచన చేయాలని సూచించింది. కరోనా పరిస్థితులతో పాటు పాక్లో ఉగ్రవాదం, విభజనవాదుల హింస ఎక్కువగా ఉండడమే అందుకు కారణంగా పేర్కొంది.
ఒకవేళ పాక్ వెళ్లినా.. ఆ దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్సుల్లో మాత్రం అసలు తిరగొద్దని, అక్కడ ఉగ్రవాదంతో పాటు అపహరణ ముఠాల ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. అలాగే నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించింది. అక్కడ ఉగ్రవాద ముఠాల కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయని పేర్కొంది. నియంత్రణ రేఖకు ఇరువైపులా భారత్, పాక్ల సైనిక బలగాలు భారీ సంఖ్యలో మోహరించి ఉంటాయని, వాటి మధ్య తరచూ ఎదురు కాల్పులు చోటుచేసుకుంటూ ఉంటాయని తెలిపింది.
బంగ్లాదేశ్లో నేరాలు, ఉగ్రవాదం, అపహరణల ముప్పు దృష్ట్యా అక్కడికి వెళ్లినప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సూచించింది.
అఫ్గాన్లో అపహరణ ముఠాలు, ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాదంతో అశాంతి నెలకొని ఉందని, అక్కడికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంది.