తెలంగాణ

telangana

ETV Bharat / international

వెనక్కి తగ్గిన ఇరాన్​, అమెరికా.. అయినా ప్రమాదం అంచునే! - ఇరాన్​ అమెరికా వార్తలు

అమెరికా-ఇరాన్​ ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్​ టాప్​ కమాండర్​ ఖాసిం సులేమానీ మరణం అనంతరం నెలకొన్న పరిస్థితులు.. పశ్చిమాసియా ప్రాంతాన్ని ప్రమాదపు అంచున నిలిపాయి. అయితే అధ్యక్షుడు ట్రంప్ నిన్న చేసిన ప్రకటనతో ఇరు దేశాలు కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న అమెరికా దళాలు హై అలర్ట్​గా ఉన్నాయి.

US, Iran step back from the brink; region still on edge
వెనక్కి తగ్గిన ఇరాన్​, అమెరికా.. అయినా ప్రమాదం అంచునే!

By

Published : Jan 9, 2020, 7:40 PM IST

Updated : Jan 9, 2020, 11:25 PM IST

పశ్చిమాసియాలో రాజుకున్న అగ్గి... యుద్ధరూపు దాలుస్తుందని ప్రపంచమంతా భయపడుతోంది. ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్‌.. ఇరాక్‌లో అమెరికా సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకొని మంగళవారం 22 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి అనంతరం అమెరికా తీవ్రంగా స్పందిస్తుందని అంతా ఊహించారు. అయితే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాంతి మంత్రాలు జపించడం ఉద్రిక్త పరిస్థితులను కాస్త తగ్గించింది.

ప్రత్యక్ష దాడులు..

1979లో టెహ్రాన్​లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఇరాన్​ స్వాధీనం చేసుకుంది. ఆ ఘటన తర్వాత మళ్లీ అమెరికాపై ఇరాన్ ప్రత్యక్ష దాడికి దిగడం ఇదే తొలిసారి. ఇరాక్​లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్​ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిని చూస్తే అమెరికా దళాల ప్రాణాలే లక్ష్యంగా ఇరాన్​ చర్యలు ఉన్నాయని అగ్రరాజ్యం రక్షణశాఖ పెంటగాన్​ తెలిపింది.

ట్రంప్​ శాంతి మంత్రాలు...

ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై ఇరాన్​ దాడి చేసిన తర్వాత శ్వేతసౌధం నుంచి ట్రంప్​ ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్​ వెనక్కి తగ్గడం వారికీ, ప్రపంచానికి మంచిదని హితవు పలికారు.

"నేను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇరాన్​ అణ్వాయుధాలను సంపాదించేందుకు అనుమతించబోం. గత రాత్రి ఇరాన్​ చేసిన దాడుల్లో ఏ అమెరికన్​ ప్రమాదానికి గురి కాలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. మా సైనికులంతా సురక్షితంగా ఉన్నారు. మా సైనిక స్థావరాలు మాత్రమే స్వల్పంగా ప్రభావితమయ్యాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అమెరికన్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్​ వెంటనే వెనక్కి తగ్గాలి. అదే అన్ని వర్గాలకు.. ప్రపంచానికి మంచిది." - డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

ఇరాన్​ దూకుడు...

ట్రంప్​ శాంతి మంత్రాలు వల్లించిన గంటల వ్యవధిలోనే ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని గ్రీన్​ జోన్​ ప్రాంతంపై రాకెట్లతో దాడి జరిగింది. అమెరికా సహా విదేశీ రాయబార కార్యాలయాలుండే గ్రీన్​ జోన్ ప్రాంతంపై రెండు రాకెట్లను ప్రయోగించినట్లు ఇరాక్​ సైన్యం తెలిపింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

హై అలర్ట్​...

అమెరికా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ... ఇరాక్​లో ఉన్న అగ్రరాజ్యం తక్షణ స్పందన దళాలు సహా అన్ని బలగాలు మాత్రం హై అలర్ట్​లో ఉన్నాయి.

ఇంకా అయిపోలేదు: ఇరాన్

తాజా దాడులను అమెరికాకు చెంప దెబ్బగా ఇరాన్‌ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమైనీ పేర్కొన్నారు.

"మా ప్రతీకారానికి ఈ దాడులు సరిపోవు. మాకు కావాల్సింది ఏంటంటే... అన్యాయంగా అమెరికా ఈ ప్రాంతంలో పాగా వేసింది. ఇక్కడ నుంచి వారు వైదొలగాలి." - అయతొల్లా అలీ ఖమైనీ, ఇరాన్​ అత్యున్నత నేత

ట్రంప్​ స్వరం ఎందుకు మారింది?

ఈ ఏడాది నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్నారు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికా పౌరుల రక్షణే తన అత్యున్నత ప్రాధాన్యమని ట్రంప్​ ప్రచార సభల్లో పలుమార్లు స్పష్టం చేశారు. అమెరికాను అంతంలేని యుద్ధాల నుంచి బయటపడేస్తానని వాగ్దానాలు ఇస్తున్నారు.

అటు ఇరాన్​ పరిస్థితులపై అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్​కు వివరించింది. అయితే డెమోక్రాట్లు, కొంతమంది రిపబ్లికన్​ సభ్యులు సులేమానీపై ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్​ విషయంలో ట్రంప్​ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

Last Updated : Jan 9, 2020, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details