భారత్కు సాయం అందించేందుకు అమెరికా అన్ని విధాలుగా కృషిచేస్తోందని అన్నారు ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు. గత వారంలో భారత్కు అమెరికా ఆరు విమానాలలో వైద్య పరికరాలు, మందులను పంపించిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సలహాదారు ఎర్విన్ మస్సింగా వెల్లడించారు.
"గత 26ఏళ్లలో అమెరికా ఈ స్థాయిలో సాయం అందించడం నేను ఎప్పుడూ చూడలేదు. ప్రైవేటు రంగం, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ భారత్కు అండగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. భారత్లో పరిస్థితిపై విదేశాంగ మంత్రి టోనీ బ్లింకన్ సహా సీనియర్ అధికారులు భారత అధికారులను సంప్రదించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు."
-ఎర్విన్ మస్సింగా, దక్షిణ ఆసియా వ్యవహారాల సలహాదారు
భారత్ పరిస్థితులపై అమెరికా తక్షణమే స్పందించిందని యూఎస్ ఎయిడ్ ఆసియా డెప్యూటీ అసిస్టేంట్ అడ్మినిస్ట్రేటర్ అంజలీ కౌర్ అన్నారు. ఆక్సిజన్ సంబంధిత వనరుల కొరతపై భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయగానే అమెరికా 1000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కొనుగోలుకు నిధులు మంజూరు చేసిందన్నారు. వీటితో పాటు భారత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న 150 ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ ఆక్సిజన్ జెనరేటింగ్ ప్లాంట్స్కు సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.