తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో 40 వేలు దాటిన కరోనా మరణాలు

కరోనా వైరస్​ అగ్రరాజ్యంలో వేగంగా విజృంభిస్తోన్న క్రమంలో అక్కడి మృతుల సంఖ్య 40 వేలు దాటింది. కొత్తగా మరో 25 వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. వైరస్​కు కేంద్రబిందువుగా ఉన్న న్యూయార్క్​లో మాత్రం కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుతుండటం సానుకూలాంశం.

By

Published : Apr 20, 2020, 8:02 AM IST

US coronavirus deaths top 40,000: Johns Hopkins
అమెరికాలో 40 వేలు దాటిన కరోనా మరణాలు

ఐరోపా దేశాల్లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో.. అమెరికాలోనూ అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. కేసులు, మరణాల్లో కాస్త క్షీణత నమోదైంది. జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం గణాంకాల ప్రకారం దేశంలో మృతుల సంఖ్య 40 వేలు దాటింది. 24 గంటల వ్యవధిలో అక్కడ 1997 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 25 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

తొలి నుంచీ వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న న్యూయార్క్​లో క్రమంగా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతుండటం ఊరట కలిగిస్తోంది. శనివారం అక్కడ మరో 507 మంది మరణించారు. ముందటి రోజుతో పోలిస్తే ఇది 43 తక్కువ. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యా గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు గవర్నర్​ ఆండ్రూ క్యోమో.

అమెరికా కరోనా వైరస్​ వివరాలు

కేసులు తగ్గుతున్నా.. వైరస్​ ప్రమాదకర దశలోనే ఉందని, భౌతిక దూరం సహా నిబంధనలన్నీ పాటించాలని సూచించారు గవర్నర్​.

ఆంక్షల సడలింపు...

వైరస్​ తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో టెక్సాస్​లో దుకాణాలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఫ్లోరిడాలో బీచ్​లు, పార్కుల్లో పరిమితంగానైనా సందర్శకుల తాకిడి మొదలైంది.

కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన ఆంక్షల్ని సడలించి, తమ తమ ఆర్థిక రంగాలను తిరిగి గాడిన పెట్టాలని అమెరికాలో గవర్నర్లు వేగిరపడుతున్నా.. మరీ వేగంగా ముందుకెళితే ఇబ్బందులేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్​డౌన్​ను వ్యతిరేకిస్తూ అనేక బృందాలు నిరసనలను తీవ్రతరం చేస్తున్నాయి.

ఆహార పొట్లాలకు ఎదురుచూపులు..

ఆకలి, నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న అమెరికన్లు మాత్రం ఆహార పొట్లాల కోసం గంటలతరబడి ఎదురుచూస్తున్నారు. లాక్​డౌన్​ వల్ల దాదాపు 2.20 కోట్ల మందికి పనిలేకుండా పోయింది. ఇలాంటి వారంతా వెల్లువెత్తుతుండటంతో ఆహార పొట్లాలకు గిరాకీ అమాంతం పెరిగిపోతోంది. పరిస్థితిని చూసి అనేక సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా అవసరాలు తీరడం లేదు.

ABOUT THE AUTHOR

...view details