అమెరికా వీసాపై సుమారు రెండున్నర నెలల ఎదురుచూపులు ఫలించనున్నాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో లాక్డౌన్ విధించటంతో కాన్సులేట్, రాయబార కార్యాలయాలను అమెరికా మూసివేసింది ఈ ఏడాది మార్చి 20న వీసా ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. తాజాగా ప్రీమియం విధానాన్ని సోమవారం ప్రారంభించనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మార్చి 20లోపు వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఐ-129, ఐ-140 ఆమోదం కోసం మరోసారి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎలాంటి దరఖాస్తు చేయనివారు ప్రస్తుతం దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండదు. ఈ రెండు విభాగాలకు సంబంధించిన ప్రక్రియను మాత్రమే ఈ విధానంలో చేపట్టాలని అమెరికా నిర్ణయించింది.
ఇమిగ్రెంట్, నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు కంపెనీలు దరఖాస్తు చేస్తే సాధారణ ప్రక్రియ పూర్తయ్యేందుకు 6 నుంచి 8 నెలల వ్యవధి పడుతుంది. ప్రీమియం విధానంలో కేవలం 15 రోజుల వ్యవధిలో దరఖాస్తు ఆమోదం పొందిందా, లేదా అన్నది యూఎస్సీఐఎస్ స్పష్టత ఇస్తుంది. ఈ ప్రక్రియ కింద 12 నుంచి 15 వేల డాలర్లను వసూలు చేస్తుంది. నిబంధనల ప్రకారం అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేస్తూ వీసా గడువు ముగిసిన వారు సుమారు 60 రోజుల వ్యవధిలో మాతృదేశానికి తిరిగివెళ్లాల్సి ఉంటుంది.