ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జూన్ 17న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ ప్రణాళిక జాబితాలో యూఎన్ఎస్సీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం మండలికి అధ్యక్షత వహిస్తున్న ఫ్రాన్స్ ఈ ఎన్నికలకు ఆమోదం తెలిపింది.
2021-22 కాలపరిమితి కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఆసియా- పసిఫిక్ స్థానానికి భారత్ మాత్రమే పోటీలో ఉంది. దీంతో మండలికి భారత్ ఎన్నిక లాంఛనం కానుంది. 2021-22 కాలపరిమితికి సంబంధించి ఆసియా- పసిఫిక్ స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికి గత ఏడాది జూన్లోనే చైనా, పాకిస్థాన్ సహా ఈ విభాగంలోని మొత్తం 55 దేశాలు మద్దతు తెలిపాయి.
ఏకగ్రీవమే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కోసం ఐరాస ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు 193 సభ్య దేశాల సర్వసభ్య సమావేశం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఓటింగ్లో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టినా.. భారత్ ఎన్నికకు వచ్చే ప్రమాదమేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.